రాయలసీమకు చెందిన ఐపీఎస్ అధికారి, పంజాబ్ డీజీపీ కన్నుమూత
చండీగఢ్: రాయలసీమకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, పంజాబ్ లోక్ సభ విభాగానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తోన్న సీఎస్ఆర్ రెడ్డి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని రేలా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. ఆయనకు భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు శృతి, లయ ఉన్నారు. సీఎస్ఆర్ రెడ్డి పూర్తి పేరు సీతారామాంజనేయ రెడ్డి. సీఎస్ఆర్ రెడ్డిగా పంజాబ్ లో సుపరిచితులు. సన్నిహితులు ఆయనను సీతారాం అని పిలుస్తుంటారు.
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాగిరెడ్డి పల్లె ఆయన స్వగ్రామం. రాజకీయ కుటుంబం నుంచి వచ్చారాయన. సీఎస్ఆర్ రెడ్డి తండ్రి సీపీ తిమ్మారెడ్డి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించిన తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో తిమ్మారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. రెండుసార్లు ఆయన ఆళ్లగడ్డకు ప్రాతినిథ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి సమీప బంధువు.
1987 బ్యాచ్ సివిల్స్ పరీక్షల్లో ర్యాంకును సాధించిన సీఎస్ఆర్ రెడ్డి.. పంజాబ్ క్యాడర్ కు ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలను తీసుకునే సమయానికి పంజాబ్ లో అనేక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండేవి. ఖలిస్తాన్ వేర్పాటు వంటి ఉద్యమాలు జరిగేవి. తొలిసారిగా పంజాబ్ సూపర్ కాప్ గా పేరున్న కేపీఎస్ గిల్ తో కలిసి వాటిని సమర్థవంతంగా అణచివేయగలిగారు సీఎస్ఆర్ రెడ్డి. పంజాబ్ లో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. తీవ్రవాదులతో ముఖాముఖి ఎదురుకాల్పుల్లో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉందని సీనయర్ అధికారులు చెబుతున్నారు.
సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు ఉన్న బటాలా, ఫిల్లౌర్ వంటి చోట్ల ఎఎస్పీగా పనిచేశారు. అనతరం జలంధర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. పటియాలా, మాఝితా, చండీగఢ్ లల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు. జలంధర్ రేంజ్ డీజీపీగా, ముఖ్యమంత్రి భద్రత విభాగానికి డీఐజీగా కీలక పోస్టుల్లో పనిచేశారు. విజిలెన్స్ బ్యురో, సెక్యూరిటీ, ట్రాఫిక్ విభాగాల్లో అదనపు డీజీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన లోక్ పాల్ డీజీపీగా ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంతాపాన్ని తెలిపారు.