హోదా కోసం 13 రాష్ట్రాలను చంద్రబాబు ఒప్పించాలి : పురంధేశ్వరి
విశాఖపట్నం : ఏపీకి ప్రత్యేక హోదా బాధ్యత ఇప్పుడు టీడీపీ బీజేపీల నడుమ నానుతోన్న విషయం తెలిసిందే. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండు సమన్వయంతో ముందడుగేస్తేనే ఈ విషయంలో పురోగతి సాధించే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. ' ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో 13 రాష్ట్రాల ప్రభుత్వాలను ఒప్పించాల్సిన బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుపై' ఉందన్నారు. రాష్ట్రంలో వెనుక బడిన జిల్లాల కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రానికి రాష్రం సమర్పించాల్సి ఉందని పురందేశ్వరి చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చిత్తూరులోని గాంధీ సర్కిల్ లో జరిగిన ధర్నాలో పాల్గొన్న పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పోలవరం ప్రాజెక్టుపై కూడా స్పందించారు పురంధేశ్వరి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.4 వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.