టీడీపీది కుల రాజకీయం .. వైసీపీది మత రాజకీయం అని పురంధరేశ్వరి ఫైర్
Recommended Video
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే మాజీ సీఎం చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్ తో కలిసి పని చెయ్యటానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పిన పురంధరేశ్వరి ఇక తాజాగా ఆయనవి మతతత్వ రాజకీయాలని మండిపడ్డారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తే జగన్ మతరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అఖిలపక్షంతో చర్చించాకే తెలంగాణ గోదావరి జలాలను తరలింపు యోచన చెయ్యాలన్న పురంధరేశ్వరి
ఏపీ సీఎం జగన్కు ఏదో మెయిల్ వస్తే, విశాఖలో చర్చిలకు మాత్రమే పోలీసు భద్రత కల్పించారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి విధానాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ నేత పురందేశ్వరి పేర్కొన్నారు. ఆయన మతరాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ కులాలు, కార్పొరేషన్ల విభజన పేరుతో రాజకీయాలు చేస్తే, వైసీపీ మతం పేరుతో సమాజాన్ని విడదీస్తోందని ఆమె ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలు మంచివి కావని ఆమె హితవు పలికారు. ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ తో మంతనాలు చేస్తున్న జగన్ అఖిలపక్షంతో చర్చించిన తరువాతే తెలంగాణతో కలిసి గోదావరి జలాలను తరలించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని పురంధరేశ్వరి జగన్ను కోరారు.
ఏపీకి నో ప్రత్యేక హోదా .. బాబు చేసిన తప్పు జగన్ చెయ్యకూడదని సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో చంద్రబాబు చేసిన తప్పుని ప్రస్తుత సీఎం జగన్ చేయకూడదు అని కేంద్ర మాజీ మంత్రి ,మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు. అయితే ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవడానికి కేంద్రం సుముఖంగా ఉందని పేర్కొన్న ఆమె ఏపీలో వలసలు కొనసాగుతాయని పురంధరేశ్వరి పేర్కొన్నారు. బిజెపిలో చేరడానికి అన్ని పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు బిజెపి వైపు ఎట్రాక్ట్ అవుతున్నారని పురందరేశ్వరి పేర్కొన్నారు.
కేసీఆర్ తో లాలూచీ అనవసరం .. టీడీపీ అవినీతిని వెలికి తియ్యండన్న పురంధరేశ్వరి
కృష్ణా గోదావరి జలాల పంపకాల్లో గతంలోనే ఆంధ్రా తెలంగాణల వాటా తేలిపోయిందని.. మళ్లీ ఈ ఆంశంపై కేసీఆర్ తో జగన్ లాలూచీ పడాల్సిన అవసరం లేదని పురంధరేశ్వరీ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వలే జగన్ కూడా ప్రజలను మభ్యపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీయాలని జగన్ ను డిమాండ్ చేశారు. మొత్తానికి పురంధరేశ్వరి అటు బాబు , ఇటు జగన్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు.