మోసం: కాంగ్రెస్పై పురంధేశ్వరి, జతకల్సిన కృష్ణం రాజు
శ్రీకాకుళం: కాంగ్రెసు పార్టీ పైన భారతీయ జనతా పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, మరో సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజులు బుధవారం నిప్పులు చెరిగారు. పురంధేశ్వరి, కృష్ణం రాజులు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
సీమాంధ్రకు బిజెపితోనే న్యాయం జరుగుతుందని పురంధేశ్వరి చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఢిల్లీ పీఠం ఎక్కాలన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెసు తీరని అన్యాయం చేసిందని, మోసం చేసిందని, బిజెపి పట్టుబట్టడం వల్లనే ఉత్తరాంధ్రకు ప్యాకేజీ వచ్చిందని చెప్పారు.
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఆంధ్రా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బిజెపి గెలవాలని, మోడీ ప్రధాని కావాలన్నారు.
మోడీని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కృష్ణం రాజు చెప్పారు. కాంగ్రెసు పార్టీ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. పదేళ్ల కాంగ్రెసు పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.