తెలంగాణ ఎన్నికలపై పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు, కేసీఆర్కు షరతు! చంద్రబాబుపై ఆగ్రహం
అనంతపురం/విజయవాడ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మహాకూటమి గెలుస్తుందా, టీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకుంటుందా అంటే.. ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను విశ్లేషిస్తే ఎవరు గెలిచినా మార్జిన్కు ఒకటి రెండు సీట్లు అటు ఇటుగా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదే జరిగితే మజ్లిస్ లేదా బీజేపీలు లేదా స్వతంత్రులు కీలకంగా మారే అవకాశముంది. ఏ పార్టీకి సీట్లు తక్కువగా వచ్చినా మొదట స్వతంత్రులను తమ వైపు తిప్పుకుంటారు. ఇంకా సీట్లు తక్కువ పడితే మజ్లిస్ లేదా బీజేపీలు చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, మజ్లిస్ పార్టీలు కూడా అదే ఆలోచనతో ఉన్నాయి.
మజ్లిస్, బీజేపీ ఆశలు
మహాకూటమికి మార్జిన్కు తక్కువ సీట్లు వస్తే స్వతంత్రులను దరి చేర్చుకునే అవకాశముంది. మజ్లిస్ పార్టీ ఏం ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది. దాదాపు మద్దతు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో తెరాసకు సీట్లు తక్కువ పడితే అయితే మజ్లిస్ లేకుంటే బీజీపీ మద్దతు తీసుకుంటుంది. బీజేపీ నేతలు కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తమకు ఓట్లు, సీట్లు పెరుగుతాయని, తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడదని చెబుతున్నారు. డబుల్ డిజిట్ సాధించే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్సెత్ర, మజ్లిస్యేతర పార్టీతోనే కలుస్తామని చెప్పారు. తద్వారా తెరాస.. ఆ పార్టీతో కలవకుంటే తాము సిద్ధమని బీజేపీ సంకేతాలు ఇస్తోంది.
ఏపీ నేతల స్పందన
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై ఏపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఏపీ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి.. మజ్లిస్ పార్టీతో జతకట్టకపోతే తెలంగాణలో తమ మద్దతు వారికే ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో మాట్లాడారు.
చంద్రబాబుపై ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం అని పురంధేశ్వరి చెప్పారు. అలాంటి రెండు పార్టీలు కలవడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్తో చంద్రబాబు జతకట్టడం అప్రజాస్వామికం అన్నారు. తాము సీపీఎస్ ఉద్యోగులకు అనుకూలంగానే వ్యవహరిస్తామని చెప్పారు.
కేసీఆర్ మూట, ముల్లే సర్దుకోవాలని బుద్ధా
మరోవైపు, తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న విజయవాడలో మాట్లాడుతూ.. మహాకూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ తర్వాత కేసీఆర్ మూట, ముల్లె సర్దుకోవాలన్నారు. చంద్రబాబు ప్రచారంతో తెలంగాణ ప్రజల్లో భరోసా వచ్చిందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేసీఆర్సలు ప్రధాని మోడీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం తపనపడే వ్యక్తి చంద్రబాబు అన్నారు.
జగన్ నిజస్వరూపం బయటపడింది
తెలంగాణ ఎన్నికల ద్వారా వైసీపీ నిజస్వరూపం బయటపడిందని ఏపీ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేస్తామంటూ, ఆయనను విమర్శించే కేసీఆర్కు మద్దతివ్వడం వైసీపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి వైసీపీ మద్దతిస్తోందన్నారు. హోదా ముగిసిన అధ్యాయమని చెప్పిన బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదని పైగా తమ పార్టీపై విమర్శలు చేయడం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు. జగన్ నిజ స్వరూపం ప్రజలందరికీ తెలిసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.