జగన్కు పురంధేశ్వరి అండ, చంద్రబాబు కార్నర్: బీజేపీ వ్యూహమా?
విజయవాడ: కేబినెట్ విస్తరణపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
పురంధేశ్వరి ఆ లేఖ ఎందుకు రాశారు అనే చర్చ టిడిపిలో జోరుగా సాగుతోంది. ఆదివారం కేబినెట్ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. 2014లో వైసిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు (అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు)లకు కేబినెట్లో చోటు దక్కింది.
మనం సమర్థిస్తున్నామా: మోడీకి పురంధేశ్వరి ఘాటు లేఖ, జగన్కు ఊరట
దీనిపై ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్నాయి. వైసిపి అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా ఈ తీరును తప్పుబట్టాయి.
టిడిపిలో సీరియస్ చర్చ
ఏపీలో బీజేపీ... టిడిపి మిత్రపక్షం. అలాంటి బీజేపీ నేత పురంధేశ్వరి కూడా కేబినెట్ విస్తరణలో వైసిపి వారికి చోటు కల్పించడంపై బహిరంగంగా విమర్శించడం, అధిష్టానానికి సీరియస్గా లేఖ రాయడం చర్చకు దారి తీసింది.
ఆమె ఎందుకు అలా రాశారు? గతంలో ఆమెకు మహిళా మోర్చా పదవి ఇచ్చిన సమయంలో టిడిపి వ్యతిరేకించిందని వార్తలు వచ్చాయి, దీంతో ఆమె వారిని టార్గెట్ చేసిందా? లేక చంద్రబాబు అంటే మొదటి నుంచి రాజకీయంగా పడదు.. కాబట్టి అందులో భాగంగా లేఖ రాసిందా అనే చర్చ సాగుతోంది. లేఖ పరిణామాలపై కూడా చర్చ జరుగుతోంది.
అధిష్టానం సూచనల మేరకు రాశారా?
దక్షిణాదిన ఎదగాలని బీజేపీ భావిస్తోంది. తొలి టార్గెట్గా వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న కర్నాటకను పెట్టుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలను కూడా టార్గెట్ చేసింది. ఏపీలో టిడిపికి మిత్రపక్షంగా ఉంటూనే ఎదగాలని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో.. కేబినెట్లోకి వైసిపి నుంచి గెలిచిన వారిని తీసుకున్నారు. దీనిని స్థానిక కీలక బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
వ్యూహాత్మకమేనా?
మంత్రులుగా ఉన్న బీజేపీ నేతలు, మరికొందరు మాట్లాడలేకపోయినప్పటికీ.. కొందరు బిజెపి నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇది వ్యూహాత్మకమే కావొచ్చునని అంటున్నారు.
టిడిపికి ధీటుగా ఎదగాలనే ఉద్దేశ్యంలో భాగంగా చంద్రబాబు తన కేబినెట్లోకి వైసిపి నుంచి గెలిచిన వారిని తీసుకోవడాన్ని అవకాశంగా.. అధిష్టానం లేదా ఢిల్లీ పెద్దల సూచనల మేరకు పురంధేశ్వరి లేఖ రాసి ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు కార్నర్
తమ పార్టీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై జగన్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇతర పార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా టిడిపి మిత్రపక్షమైన బిజెపి కూడా విమర్శించడంతో.. చంద్రబాబు పూర్తిగా కార్నర్ అయ్యారని అంటున్నారు. ఇప్పటికే పురంధేశ్వరికి చంద్రబాబు పైన అసంతృప్తి ఉంది. చంద్రబాబుపై సమయం చిక్కినప్పుడల్లా ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు.