చేశాం, చేస్తాం: బాబు మాటకు పురంధేశ్వరి నో! నిద్రపోను: ముద్రగడ
ఒంగోలు: ఏపీకి బిజెపి ఇప్పటికే ఎంతో సహాయం చేసిందని, ఇక ముందు కూడా పూర్తి సహకరిస్తుందని ఆ పార్టీ జాతీయ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం అన్నారు. ప్రకాశం జిల్లా బిజెపి నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి ఆమె ఒంగోలు వచ్చారు.
ఆమెతో పాటు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. మార్చి ఆరో తేదిన రాజమండ్రిలో నిర్వహించే బిజెపి బహిరంగ సభలో తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పాల్గొని ఏపీకి అందించే సహకారంపై వివరిస్తారన్నారు.
Also Read: బెజవాడకు బెదిరింపు, సీమకి పరిశ్రమ.. బాబు పొరపాటు!: బైరెడ్డి ఫైర్
పట్టిసీమ పోలవరం డిజైన్లో భాగం కాదన్నారు. జలవనరుల శాఖ అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోకి దీనిని తీసుకునే అవకాశం ఉందన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మూడుసార్లు విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ప్రతిపాదనలు చేశానని చెప్పారు.
ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి విశాఖ రైల్వేజోన్ కోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. సాగరమాలలో భాగంగా జిల్లాలోని రామాయపట్నాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నామన్నారు. కన్నా మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్కు ఎలాంటి విఘాతం కలగకుండా కాపులను బీసీల్లో చేర్చే విషయమై బిజెపి కట్టుబడి ఉందన్నారు.
ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో జరగుతున్న పరిణామాలను విశ్లేషిస్తూ దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి ఆటంకం కలిగే ఎలాంటి చర్యలనైనా ప్రజలంతా తిప్పి కొడతారన్నారు. కాగా, పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు పురంధేశ్వరి పోలవరంలో భాగం కాదని చెప్పడం గమనార్హం.
సీఎం హామీ అమలయ్యే వరకు నిద్రపోను: ముద్రగడ
కాపులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు తాను నిద్రపోనని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. గడువు పూర్తయ్యే వరకు తాను వేచి ఉంటానని చెప్పారు. హామీలు అమలు చేస్తారనే నమ్మకంతోనే తాను దీక్ష విరమించానని చెప్పారు. కాపులను బీసీలలో చేర్చేతే ఒప్పుకోమని అంటున్న బిసి నేతలు పేద కాపుల సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోవాలన్నారు.