బాలకృష్ణ, హరికృష్ణ మహానాడు వేదికపై ఉంటే బాగుండేది:పురంధేశ్వరి
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 95వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె, సీనియర్ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరీ, తన భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావుతో కలసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహానాడును తెలుగుదేశం ప్రభుత్వం పండుగలా జరుపుకుంటోందని, అలాగే ఎన్టీఆర్ జయంతి మే 28ని తెలుగు జాతి పండుగలా జరపాలని కోరారు. అయితే ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ మహానాడు వేదికపై ఉండుంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రజలకు తాను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని, ఆయన గురించి అందరికీ తెలిసిందేనని అన్నారు.
ఎన్టీఆర్ పుట్టిన కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ కృష్ణాజిల్లాగా పేరు పెట్టాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. దక్షిణ భారతీయులను మద్రాసీలుగా భావిస్తుంటే తెలుగు వారికి ప్రత్యేక చరిత్ర ఉందని విశ్వవ్యాప్తంగా చాటిన మహనీయులు ఎన్టీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అనేక సంస్కరణలతో పాలనను ప్రజలకు దగ్గర చేశారని పురుంధేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని హరికృష్ణ కోరడం సమంజసమే నన్నారు.