వివరాలిచ్చారా, స్పష్టత ఉందా?: బాబుకు పురంధేశ్వరి, టిడిపి భేటీకి వైసిపి ఎంపీ
రాజమండ్రి: కేంద్ర బడ్జెట్లో ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదని, అన్యాయం జరిగిందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన బిజెపి నేత, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మంగళవారం నాడు పరోక్షంగా స్పందించారు. ఆమె ప్రశ్నలు సంధించారు.
పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం పైన కేంద్రానికి స్పష్టమైన వివరాలు ఇవ్వలేదన్నారు. సరైన వివరాలు కేంద్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బిజెపి చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం ఏమాత్రం లేదన్నారు.
పట్టిసీమను పోలవరం నిర్మాణ వ్యయంలో ఎందుకు చేర్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాజధాని అమరావతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. వీటిపై మాట్లాడాలన్నారు. ఏపీకి బిజెపి ఎలాంటి అన్యాయం చేయదని చెప్పారు. నిధుల విషయంలో కేంద్రాన్ని నిందించవలసిన అవసరం లేదన్నారు. పోలవరం అథారిటీకి సరైన వివరాలు ఇవ్వనందునే రూ.1200 కోట్లు అడిగితే రూ.100 కోట్లు వచ్చాయని చెప్పారు.
నాకు కుటుంబం కంటే పార్టీ ముఖ్యం: చంద్రబాబు
విజయవాడలో జరిగిన టిడిపి భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు కుటుంబం కంటే పార్టీనే ముఖ్యమని చెప్పారు. టిడిపి చేసిన అభివృద్ధిని చూసి కొందరు పార్టీలోకి వచ్చారని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం అందరూ సర్దుకుపోవాలన్నారు.
కాగా, టిడిపి సమావేశానికి వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి డేవిడ్ రాజు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కూడా హాజరయ్యారు. కాగా, టిడిపి సమావేశానికి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా హాజరయ్యారు. ఇతను కూడా వైసిపి నుంచి గెలుపొందారు.