సభ్యసమాజం ఆమోదించదు: బాలకృష్ణపై పురంధేశ్వరి ఆగ్రహం, కర్నాటకలో ప్రచారం
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు చాలా బాధాకరం అన్నారు.
Recommended Video
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పురంధేశ్వరి కర్నాటకలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాజ్యాంగబద్ధమైన దేశ ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీపై అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని సభ్య సమాజం ఆమోదించదని చెప్పారు. అనంతరం కర్నాటక ఎన్నికలపై మాట్లాడారు.
పక్కరాష్ట్రాల నేతలు మీ కష్టాలను తీర్చలేరు
కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగు వారు విజ్ఞత గలవారని పురంధేశ్వరి చెప్పారు. అభ్యర్థుల్లో ఎవరు మంచివారో బేరీజు వేసుకుని గెలిపిస్తే వారి అండదండలు లభిస్తాయని తెలిపారు. అంతే తప్ప పక్కరాష్ట్రాల నేతలు మీ కష్టాలను తీర్చలేరని చెప్పారు.
ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు
రాష్ట్రంలో ఓటర్లు మార్పును కోరుకుంటున్నట్లు తమ పార్టీ పరిశీలనలో వెల్లడైందని పురంధేశ్వరి చెప్పారు. తుంగభద్ర జలాశయంలో నీరున్నా సరైన సమయంలో కాల్వలకు విడుదల చేయకపోవడంతో ఒక పంట సైతం పండించలేని దుస్థితిలో ఉన్నామంటూ రైతులు మొరపెట్టుకుంటున్నారన్నారు.
బీజేపీ ఒక్కటే ఉండాలనుకోవడం దుర్మార్గం
రాష్ట్రాలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని, దేశమంతా బీజేపీ ఒక్కటే ఉండాలనుకోవడం దుర్మార్గమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన రావు వేరుగా ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబును విజయవాడలో కలసిన గవర్నర్ నరసింహన్ దూకుడు తగ్గించమని చెప్పినట్టు వార్తలు వచ్చాయని, విభజన సమయంలో నరసింహనే గవర్నర్గా ఉన్నారని, విభజన హామీలు అమలు చేయాలని కేంద్రానికి చెప్పాల్సింది పోయి, టీడీపీని దూకుడు తగ్గించుకోమని చెప్పడం ఏమిటన్నారు.
అమరావతి గురించి మాట్లాడరా?
గుజరాత్లో నిర్మిస్తున్న ధోలేరా నగరానికి సంబంధించి ఢిల్లీ పత్రికల్లో ఒక పేజీ ప్రకటన జారీ చేశారని, సూరత్, అహ్మదాబాద్, జామ్ నగర్, భావ్ నగర్, వదోదర వంటి మెగా పట్టణాలు గుజరాత్లో ఉండగా ఇప్పుడు మరో నగరం ధోలేరాకి రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారని కంభంపాటి అన్నారు. రూ.44,700 కోట్ల అంచనా వ్యయంతో ధోలేరా నగరాన్ని నిర్మిస్తున్నారని, నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.1500 కోట్లు ఏ విధంగా సరిపోతాయని ప్రశ్నించారు. దానిపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.