ఏ ముఖం పెట్టుకొని కలుస్తున్నావ్, చంద్రబాబు ఓ ఊసరవెల్లి, కట్టప్ప: పురంధేశ్వరి, సునీల్ నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం చెప్పారు. ఆమె కర్నూలులో విలేకరులతో మాట్లాడారు.
Recommended Video
బాబుకు మానసిక సమస్య ఉందన్న విజయసాయి ఆ పేరు చెప్పారు, ఈ రోగం ఉన్నవారికి చికిత్స ఇదే
ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్తో కలుస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారని ఆమె నిలదీశారు. దీనిపై ఏపీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని తిట్టి దోస్తీ చేస్తారా అన్నారు.
ఏ కూటమి ఏర్పాటు చేసినా ఇబ్బంది లేదు
ఏపీకి ఎన్ని నిధులు అవసరమైనా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పురంధేశ్వరి చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ కూటమి ఏర్పాటు చేసినా తమకు ఇబ్బంది లేదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికలలో కూడా ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమను గద్దె దించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటయ్యే కూటమితో నష్టం లేదన్నారు.
ఎలా అర్థం చేసుకోవాలి
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో ఎలా జతకడుతోందని ప్రశ్నించారు. దీనిని ఆంధ్రప్రదేశ్ అందరూ ఎలా అర్థం చేసుకోవాలని అడిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తాము కీలక శక్తిగా మారుతామని చెప్పారు.
చంద్రబాబు ఊసరవెల్లి, కట్టప్ప
చంద్రబాబుపై మరో బీజేపీ నేత సునీల్ ధియోదర్ వేరుగా మండిపడ్డారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ సర్కార్ అని బీజేపీ జాతీయ కార్యదర్శి అయిన ధియోదర్ అన్నారు. టీడీపీ అధ్యక్షులు పేరు చంద్రబాబు కాదని, ఆయన చందాబాబు అని ఎద్దేవా చేశారు. 2014లో రాహుల్ గాంధీ ఆంధ్రా ద్రోహి అని, ఇప్పుడు మిత్రుడు అయ్యాడా అని ప్రశ్నించారు. అసలు ఆంధ్ర ద్రోహి చంద్రబాబే అన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి, కట్టప్ప అన్నారు. ధియోదర్ తెలంగాణపై కూడా స్పందించారు. తెలంగాణలో ఎక్కడా లేని అవినీతి జరుగుతోందన్నారు. కేసీఆర్ది ఫ్యామిలీ రాజ్ అన్నారు.