సీబీఐ విచారణకు సిద్ధమా, ఇక సహించేది లేదు: చంద్రబాబుకు పురంధేశ్వరి
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజులు సోమవారం నిప్పులు చెరిగారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబును దోషిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
తన వైఫల్యాలనుకవర్ చేసుకునేందుకే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయారని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఏపీ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఏపీకి చేసింది మాత్రం ఏమీ లేదన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు.
సీబీఐ విచారణకు సిద్ధమా.. బాబుకు పురంధేశ్వరి
బీజేపీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పురంధేశ్వరి అన్నారు. కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న కారణంగానే నవయుగ పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.
దాడులు సహించేది లేదు
పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నవయుగ సంస్థను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీకి పిలిపించి ఆదేశాలు జారీ చేశారన్నారు. నవయువక సంస్థపై గడ్కరీ చేసిన ఒత్తిడి గురించి రాష్ట్ర ప్రజలకు టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను సహించేది లేదని హెచ్చరించారు.
చంద్రబాబు మాట ఎందుకు మార్చారు
2014లో బీజేపీతో కలిసి పోటీ చేసినందువల్ల టీడీపీ లబ్ధి పొందిందని విష్ణు కుమార్ రాజు అన్నారు. కానీ స్వప్రయోజనాల కోసం మధ్యలోనే దోస్తీకి స్వస్తీ చెప్పారన్నారు. ప్రత్యేక హోదాపై మాట మార్చారని చంద్రబాబు అనడం సరికాదన్నారు. అసలు ఆయన మొదట ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న భూకుంభకోణాలపై సిట్ నివేదిక బయట పెట్టాలన్నారు.
అవినీతిపై ఆగ్రహం
పట్టిసీమలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విష్ణు అన్నారు. పంపుసెట్ల విషయంలో రూ.60 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్క క్యూబిక్ మట్టికి రూ.21 వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రూ.69 కోట్లు స్వాహా చేశారన్నారు. పెన్షనర్లను బెదిరించి మరీ నవనిర్మాణ దీక్షలకు తీసుకొచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.