బీజేపీ ఇసుక సత్యాగ్రహం .. వరదలొచ్చి 2 నెలలే .. మీరొచ్చి 6 నెలలు అన్న పురంధరేశ్వరి
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే వైసీపీ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై అందరూ స్పందిస్తున్నారని బిజెపి నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇసుక కొరత పేరుతో తమపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని, వరదలు ఉంటే ఇసుక ఎలా తవ్వకాలు చేస్తారని ప్రశ్నిస్తున్న అధికార పార్టీ నాయకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీలో చేరికపై స్పందించిన దగ్గుపాటి పురంధరేశ్వరి ... ఒత్తిడి నిజమే కానీ ...
నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడుతుంటే అధికార పార్టీ నేతల మాటలు అవహేళన చేసినట్టుగా ఉన్నాయని పురంధరేశ్వరి అంటున్నారు. ఉపాధిలేక కార్మికులు ఆత్మహత్యలబాట పడుతుంటే వైసీపీ నాయకులు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
కృష్ణా జిల్లా విజయవాడలో ఇవాళ బీజేపీ ఇసుక సత్యాగ్రహం నిర్వహిస్తుంది . రాష్ట్రంలో ఇసుక సంక్షోభానికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహం చేపట్టారు . ఇసుక సత్యాగ్రహంలో పాల్గొన్న పురంధరేశ్వరి ఇసుకపై తప్పుడు విధానాలకు ప్రభుత్వం కారణమని ఆరోపించారు. గత రెండు నెలలుగా వరదలు ఉన్నాయని, అయితే ఆరు నెలల నుండి ఇసుక కొరత అలాగే ఉందని ఆమె పేర్కొన్నారు .
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విఫలమైందని, ఇసుక కొరత రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రభావితం చేసిందని ఆమె అన్నారు.ఇసుక సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడిన పురంధరేశ్వరి వరదలు వచ్చాయని చెప్పడం సాకు మాత్రమేనన్నారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక కొరత నెలకొందని ముందస్తుగా ఇసుకను ఎందుకు నిల్వ చేయలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరదలు వచ్చి 2నెలలే అయ్యిందని పేర్కొన్న పురంధరేశ్వరి కానీ మీరు వచ్చి 6నెలలు కావొస్తోందని జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాత విధానం రద్దు చేసి 5నెలలైనా కొత్త విధానం తీసుకురాలేదన్నారు. పీపీఏల రద్దు, రివర్స్ టెండరింగ్, ఇసుక సమస్యల కారణంగా.. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని పురంధరేశ్వరి విమర్శించారు.