బాబుకు తెలియందేం కాదు: అమిత్ షాతో భేటీపై పురంధేశ్వరి, కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఒక్క రాష్ట్రాన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ కేటాయింపులుండవని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారని ఆ పార్టీ నేత పురంధేశ్వరి చెప్పారు. బడ్జెట్పై ఏపీ సీఎంతోపాటు టీడీపీ నేతలు అసంతృప్తి చేశారన్న విషయంపై అమిత్ షా పై విధంగా స్పందించారని ఆమె తెలిపారు.
కేంద్ర బడ్జెట్ దేశంలోని అన్ని రాష్ట్రాలను, దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరుగుతుందని అమిత్ షా చెప్పారని పురంధేశ్వరి తెలిపారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదని అమిత్ షా అన్నారని తెలిపారు. రైల్వే జోన్ అంశాన్ని బడ్జెట్ తో ముడిపెట్టడం సరికాదని అన్నారు.
డీపీఆర్ లేకుండా నిధులెలా?
ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి డీపీఆర్ రూపొందించలేదని, అలాంటి సందర్భంలో నిధులు కేటాయించడం ఎలా జరుగుతుందని పురంధేశ్వరి అన్నారు. ఇప్పటికే 2వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని, డీపీఆర్ వస్తే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.
ప్రజా ధనాన్ని కాపాడాం
రాష్ట్రానికి కేటాయించాల్సిన అన్ని అంశాలను బడ్జెట్లో చేర్చడం కుదరని అన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని పురంధేశ్వరి చెప్పారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన భుజాలపై వేసుకున్నారని తెలిపారు. ప్రజా ధనాన్ని వృథా కాకుండా చూశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యయాన్ని పెంచాలని కోరిందని, అయితే పాత ధరలకే నవయుగకు పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చామని పురంధేశ్వరి తెలిపారు. దీంతో ప్రజా ధనం చాలా వరకు వృథా కాకుండా చూశామని తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు తెలపాలని అమిత్ షా సూచించారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు.
టీడీపీతో విబేధాల్లేవ్
బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా సూచించారని అన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. మిత్రపక్షాలుగానే పనిచేస్తామని చెప్పారు.
టీడీపీతో కలిసే పోటీ
కాగా, 2019 ఎన్నికల్లో కూడా ఏపీలో టీడీపీతో కలిసే పోటీచేస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తేల్చిచెప్పినట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా ఏపీ టీడీపీ-బీజేపీ నేతల మధ్య పెద్దఎత్తున మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో మళ్లీ టీడీపీతో కలిసే పోటీచేస్తామని.. అందులో ఎలాంటి మార్పు ఉండదని ఏపీ బీజేపీ నేతలకు అమిత్షా తేల్చిచెప్పేశారు.
అందుకే పోలవరం ప్రస్తావన లేదు
మిత్రధర్మానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దని ఈ సందర్భంగా అమిత్ షా నేతలకు సూచించారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై.. ఒడిశాతో చర్చలు జరుపుతున్నామని.. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్కు ఎలాంటి నిధుల సమస్య ఉండదని అమిత్ షా స్పష్టం చేశారు. నాబార్డు రుణాలు ఇస్తున్నందున పోలవరాన్ని బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. ఈ విషయాన్ని నితిన్ గడ్కరీతో కూడా చర్చించామని నేతలతో అమిత్షా వివరించారు.