తెలుగోడికి కీలక పదవి: ఐఏసీసీ అధ్యక్షుడిగా పూర్ణచంద్ర రావు ఎన్నిక
హైదరాబాద్: ఓ కీలక పదవి తెలుగువాడిని వరించింది. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరపనేని పూర్ణచంద్ర రావు ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తి సూరపనేని.
సూరపనేని పూర్ణచంద్ర రావు ప్రస్తుతం నగరంలోని గ్లోబల్ ఇన్ఫోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. 2018 నుంచి 2020 వరకు ఐఏసీసీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవరించారు. 52 ఏళ్లుగా భారత, అమెరికా వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలను సమన్వయం చేసే అత్యున్నత సంస్థగా ఐఏసీసీ వ్యవహరిస్తోంది.
ముంబైలోని సంస్థ ముఖ్య కార్యాలయంలో బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020-2021 కాలానికి ఈ ఎన్నిక జరిగింది. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తానని పూర్ణచంద్ర రావు ఈ సందర్భంగా తెలిపారు. ఐఏసీసీతో ఉన్న అనుబంధం తనకు అనుభవంగా ఉపయోగపడుతుందన్నారు.
యుఎస్ కాన్సులేట్లతో, భారతదేశంలో వారి వాణిజ్య జోండింపులతో ఛాంబర్ మంచి సంబంధాన్ని కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది తనకు ఇచ్చిన భారీ బాధ్యత అని, ఇరు దేశాల మధ్య మంచి ద్వైపాక్షిక సంబంధాల కోసం కృషి చేస్తానని చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి అనేక కంపెనీలు బయటికి వస్తున్నాయని.. వాటిని భారత్ ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వంతో కలిసి మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తామన్నారు.