చెప్పులూ చీపుళ్లతో కొడ్తారు: టిడిపిలో చేరిక వార్తలపై వైసిపి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ట్విస్ట్
విజయనగరం: తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను విజయనగరం జిల్లా కురుపాం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు పుష్ప శ్రీవాణి ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె సోమవారంనాడు అన్నారు.
రాజకీయాలు అంటే తెలియని రోజుల నుంచి తనకు వైయస్ రాజశేఖర రెడ్డి అంటే విపరీతమైన అభిమానమని, ఆ అభిమానంతోనే నియోజకవర్గం ప్రజలు తనను 20 వేల మెజారిటీతో గెలిపించారని ఆమె అన్నారు. అయినా తెలుగుదేశం పార్టీలో ఏముందని చేరడానికని ఆమె వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రజల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నారని, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యురాలిగా తాను ధైర్యంగా వెళ్ల గలుతున్నానని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని గెలిచినవాళ్లమని, అలాంటిది తాను పార్టీ మారి టిడిపిలోకి వెళ్తే నియోజకవర్గం ప్రజలు చెప్పులూ చీపుళ్లతో తరిమికొడుతారని ఆమె అన్నారు.
వైయస్ జగన్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని ఆమె అన్నారు. తెలంగాణలో అధికార అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, బేరసారాలు ఆడుతోందని వ్యాఖ్యానించిన టిడిపి ఇప్పుడు తాను చేస్తున్నదేమిటని ఆమె ప్రశ్నించారు. టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు.