వైయస్ ఉన్నప్పుడు రమణదీక్షితులు మాట్లాడలేదేం, ఇప్పుడే ఎందుకు: టీటీడీ చైర్మన్
తిరుమల: రమణదీక్షితులు ఆరోపణలపై టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం స్పందించారు. దీక్షితులు ఆరోపణలు సరికాదన్నారు. ఆయనపై టీటీడీకి ఎలాంటి కక్ష సాధింపు లేదని చెప్పారు. గతంలో ఎప్పుడూ చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
టీటీడీ బోర్డు భక్తుల సేవకే గానీ పెత్తనానికి కాదన్నారు. రమణ దీక్షితులే కాదని, సామాన్య భక్తులు కూడా తీసుకు వచ్చిన అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి - కరుణాకర్ రెడ్డి హయాంలో రమణదీక్షితులు ఎందుకు మాట్లాడలేదన్నారు.
ఇతర దేవాలయాల్లో తొలగింపుపై బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్
పదవీ విరమణ పేరుతో రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో పని చేస్తోన్న అర్చకులను తొలగించబోమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య తెలిపారు. టీటీడీ వ్యవహారం వేరని, రాష్ట్రంలో ఇతర ఆలయాల వ్యవహారం వేరన్నారు. 65 ఏళ్ల వయసు పైబడ్డ అర్చకులను పదవీ విరమణ పేరుతో తొలగిస్తామని సాగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు..
శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి ఆభరణాలు భద్రం: టీటీడీ ఈవో, రమణదీక్షితులు ఆరోపణలపై ఆధారాల సేకరణ
అంతకుముందు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వ్యాఖ్యలపై అంతకుముందు రమణ దీక్షితులు స్పందించారు. మరమ్మత్తు కోసం 25 రోజులు పోటును ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. ఎవరి సలహాలు తీసుకోకుండానే మరమ్మత్తులు చేశారన్నారు. ప్రసాదం బయట చేసి తీసుకు రావడం శాస్త్రానికి విరుద్దమన్నారు. 25 రోజులు అపవిత్రస్థలంలో ప్రసాదాన్ని నైవేద్యంగా అందించారన్నారు. అంటే ఈ 25 రోజులు స్వామివారు ఉపవాసంతో ఉన్నట్లే అని చెప్పారు. ప్రసాదం తయారు చేశాక నైవేద్యం పెట్టే వరకు వంట మనిషి, అర్చకులు తప్ప ఎవరూ చూడకూడదన్నారు.
పూర్వం నుంచి స్వామివారికి ఆగమోక్తంగా పూజలు జరుగుతున్నాయన్నారు. ఆగమం అంటే వేదాల నుంచి వచ్చిందని అర్థమని, వేదం అంటే విజ్ఞానం అన్నారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రాకారాలను తవ్వేశారన్నారు. ప్రాచీన శిల్పసంపదను ఎవరి అనుమతితో కూల్చివేశారని ప్రశ్నించారు. అర్చకులు అంటే టీటీడీకి చులకన భావన అన్నారు. అపచారాల నుంచి స్వామివారిని భక్తులే కాపాడాలన్నారు. ఇనుప నిచ్చెన మీద స్వామివారిని మండపం పైకి తరలిస్తున్నారని, స్వామివారిని ఇనుము తాకితే అపరాధం అన్నారు.
1996 నుంచి ఆభరణాలకు భద్రత కరువైందన్నారు. 1996లో మీరాశి రద్దు కావడంతో ఆభరణాలను టీటీడీ స్వాధీనం చేసుకుందన్నారు. ఐదు పేటల వజ్రాలు పొదిగిన ప్లాటినం హారంలో గులాబీ రంగుతో వజ్రం ఉండేదని, గరుడ సేవలో భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందని రికార్డుల్లో రాశారని, ఆ నాణేలు విసిరితే వజ్రం పగులుతుందా అని ప్రశ్నించారు. ఇటీవల జెనీవాలో ఓ గులాబీ రంగు వజ్రం వేలానికి వచ్చిందని, ఆ వజ్రం ఇదే కావొచ్చునని రమణదీక్షితులు అనుమానం వ్యక్తం చేశారు. ఇలా 22 ఏళ్లలో ఎన్ని మణులు, మాణిక్యాలు వెళ్లిపోయాయో అన్నారు. వీటిపై ఎందుకు విచారణ జరపకూడదన్నారు. దీనిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.