పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి హిందూపురం జిల్లా?
అనంతపురం: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ఆరంభమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చుతానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రస్తుతం అధికారులు జిల్లాల నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు.
పాక్, బంగ్లాదేశ్ సైన్యానికి స్వీట్లను పంచి పెట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు
హిందూపురం.. నందమూరి వంశానికి కంచుకోట!
రాష్ట్రంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా ఏ ఇతర రాజకీయ పార్టీ అయినా సరే! ఒక్కసారి కూడా గెలవని అసెంబ్లీ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది హిందూపురమే. 1983 నుంచీ 2019 దాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధిస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వరుసగా మూడుసార్లు ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తరువాత అన్నా టీడీపీ తరఫున దివంగత నందమూరి హరికృష్ణ ఒకసారి, ఎన్టీ రామారావు మరో కుమారుడు, నటుడు బాలకృష్ణ వరుసగా రెండోసార్లు హిందూపురంలో జెండా పాతారు.
కనీస సౌకర్యాల కొరత..మంచినీటికీ కటకటే!
కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉండే ఓ చిన్న పట్టణం హిందూపురం. మంచినీటి ఎద్దడి తీవ్రం. సాగునీటికీ కటకటలాడాల్సిన దుస్థితి హిందూపురం పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉంది. ఓ జిల్లా కేంద్రానికి అవసరమైన వనరులు, మౌలిక వసతులు హిందూపురంలో లేవు. రవాణా వసతులూ తక్కువే. హైదరాబాద్-బెంగళూరు రైల్వే లైన్ మినహా చెప్పుకోదగ్గ రవాణా సౌకర్యాలు కొరవడ్డాయి. హిందూపురం పరిధిలోని హిందూపురం, లేపాక్షి, చీలమత్తూరు మండలాలు సగానికి పైగా ఏటా కరవును ఎదుర్కొంటుంటాయి. అందుకే ఆయా గ్రామాల ప్రజలు పొరుగునే ఉన్న బెంగళూరు, బళ్లారి వంటి నగరాలకు వలస వెళ్తుంటారు.
సత్యసాయి హిందూపురం జిల్లాగా పేరు.
హిందూపురంలో నెలకొన్న సౌకర్యాల కొరతను దృష్టిలో ఉంచుకుని అదే లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయి. పుట్టపర్తికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అనంతపురం జిల్లాలో మెజారిటీ ప్రజలు దైవ సమానంగా పూజించే సత్యసాయి బాబా ఆశ్రమం ఇక్కడే ఉంది. రోడ్డు, రైలు, విమాన మార్గాలకు అనువైన పట్టణం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తుల సౌకర్యాల కోసం ముందస్తుగా పుట్టపర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించారు. క్రికెట్ స్టేడియం కూడా ఈ పట్టణంలో ఉంది.
సత్య సాయిబాబా సేవకు గుర్తింపుగా..
సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధీనంలో నిర్మితమైన కార్పొరేట్ ఆసుపత్రులు, డీమ్డ్ యూనివర్శిటీ స్థాయి విద్యాసంస్థలు పుట్టపర్తిలో ఉన్నాయి. పరిపాలనకు అనువైన భవనాలను నిర్మించడానకి అవసరమైన ఖాళీ ప్రదేశాలు పుట్టపర్తిలో ఉన్నాయి. అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో.. హిందూపురానికి బదులుగా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే- హిందూపురం జిల్లా పేరును కూడా మార్చవచ్చని తెలుస్తోంది. సత్యసాయి హిందూపురం జిల్లాగా దీనికి నామకరణం చేసే అవకాశాలు లేకపోలేదు.
ప్రజాభిప్రాయ సేకరణ తరువాతే నిర్ణయాలు..
హిందూపురం లోక్సభను జిల్లాగా ప్రకటించడం వల్ల కొత్తగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మున్ముందు ఇబ్బందికర పరిస్థితులేవైనా తలెత్తడానికి గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా- హిందూపురం లోక్సభ నియోజవర్గం పరిధిలోని మండలాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి కూడా ప్రభుత్వం వెనుకాడకపోవచ్చు. మండలాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి, దానికి అనుగుణంగా ప్రతిపాదన రూపకల్పన చేస్తారని తెలుస్తోంది.