అతిపెద్ద బ్రాండ్లలో ఇదొకటి: వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా సింధు
అమరావతి: ప్రఖ్యాతిగాంచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు బాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలంపిక్ రజత విజేత పీవీ సింధు బ్రాండ్ అంబాసడర్గా ఎన్నికైంది. దీనికి సంబంధించిన వివరాలను బేస్లైన్ వెంచర్స్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణన్ శనివారం వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఒప్పందంతో వైజాగ్ స్టీల్ అథ్లెట్ రంగంలో ప్రధాన భాగస్వామి మారిందని చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, భారతదేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో సింధు ధరించే జెర్సీపై వైజాగ్ స్టీల్ లోగో ఉంటుందన్నారు.
అనంతరం పీవీ సింధు మాట్లాడారు. తాను ఒప్పందం చేసుకున్న అత్యంత ముఖ్యమైన పెద్ద బ్రాండ్లలో ఇది కూడా ఒకటని తెలిపింది. ప్రతి నెలా మూడు ప్రధాన టోర్నీలు జరిగేలా బ్యాడ్మింటన్ క్యాలెండర్ ను మార్చారని... దీని కారణంగా సరైన టోర్నీని సెలెక్ట్ చేసుకుంటేనే ర్యాంకింగ్ మెరుగుపడుతుందన్నారు.
సింధు, వైజాగ్ స్టీల్ రెండూ భారతదేశం యొక్క అమూల్యమైన ఆస్తులు అని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి. మధుసూదన్ చెప్పారు. కాగా పీవీ సింధు ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 అత్యుత్తమ క్రీడాకారిణిగా ఒకరిగా ఉన్నారు. రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.