శ్రీవారి సేవలో పీవీ సింధు, ఎమ్మెల్యే రోజా: పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తల్లిదండ్రులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 68 కిలోల బెల్లంతో శ్రీవారికి తులాభారం మొక్కు చెల్లించుకున్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ప్రముఖులకు టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
పెరగనున్న భక్తుల రద్దీ
ఏడుకొండల వెంకన్న కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం తెల్లవారు జాము నుంచి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
శనివారం ఒక్కరోజే వెంకన్నను 76,137 మంది భక్తులు దర్శించుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఆదివారం, సోమవారం వరుస సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.