సంచలనం: ప్యారడైజ్ పేపర్స్లో 'పీవీపీ', జగన్ కంపెనీలతో లింకు?, వైఎస్ఆర్ హయాంలో!..
ఇదే క్రమంలో జగతి పబ్లికేషన్ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టారు. జగన్ మీడియాల్లో దాదాపు రూ.131కోట్ల పెట్టుబడులు పీవీపీ పెట్టినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ప్యారడైజ్ పేపర్స్ లీక్స్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారిశ్రామికవేత్త పీవీపీ పేరు కూడా వినిపిస్తోంది. మారిషస్ లో ఓ కంపెనీని నెలకొల్పిన ఆయన.. అక్కడి నుంచి స్వదేశంలోని పలు కంపెనీలకు పెట్టుబడులు తీసుకొచ్చారన్న విషయం వెలుగుచూసింది.
ఆ సొమ్ముతోనే వైసీపీ అధినేత జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ లోను పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలున్నాయి. ప్యారడైజ్ పేపర్స్ లో వెల్లడైన సమాచారం సరైందేనని, అయితే తామెక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదని పీవీపీ చెబుతుండటం గమనార్హం.
మారిషస్లో 'ప్లాటెక్స్'
పారిశ్రామికవేత్తల ఆఫ్ షోర్ లావాదేవీలు గుట్టురట్టవడంతోనే పీవీపీ సంస్థ లెక్కలు బయటపడ్డాయి. 2007లో మారిషస్లో ప్లాటెక్స్ అనే కంపెనీని పీవీపీ స్థాపించినట్టు ప్యారడైజ్ పేపర్స్ లో వెల్లడైంది. ఆ సంస్థ నుంచి వందల కోట్ల నిధులను స్వదేశంలోని కంపెనీలకు తరలించినట్లు కూడా తేలింది.
ఇదే క్రమంలో జగతి పబ్లికేషన్ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టారు. జగన్ మీడియాల్లో దాదాపు రూ.131కోట్ల పెట్టుబడులు పీవీపీ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా వైఎస్ఆర్ హయాంలో పీవీపీ సంస్థలకు భారీ భూకేటాయింపులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో సీబీఐ పీవీపీని కూడా ప్రశ్నించింది.
పెట్టుబడులు-భూకేటాయింపులు
పీవీపీ అధినేత పొట్లూరి వి ప్రసాద్ ప్లాటెక్స్ కంపెనీకి 100శాతం షేర్ హోల్డర్ గా ఉన్నారు. విదేశాల్లో స్థాపించిన ఈ కంపెనీకి తానే వ్యక్తిగత పూచీకత్తుగా ఉన్నారు. పలు ఆర్థిక సంస్థల నుంచి ఇరవై కోట్ల 76 లక్షల డాలర్లను, భారతీయ కరెన్సీలో రూ.886కోట్లను రుణంగా పొందారు.
ఆపై ఆ సొమ్మును ఇండియాలోని తన లిస్టెడ్ కంపెనీ పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీలు న్యూ సైబరాబాద్ సిటీ ప్రాజెక్ట్స్, పీవీపీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి వాటికి తరలించారు. ఇదే క్రమంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ లోను పెట్టుబడులు పెట్టారు. అందుకు ప్రతిగా వైఎస్ఆర్ హయాంలో భూకేటాయింపులు జరగినట్టు ఆరోపణలు వచ్చాయి, క్విడ్ ప్రో కో కింద సీబీఐ అప్పట్లో పీవీపీ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించింది.
ప్లాటెక్స్ సొమ్ము కాదు
జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడిగా పెట్టిన సొమ్ము ప్లాటెక్స్ కంపెనీ నుంచి తెచ్చింది కాదని పీవీపీ సంస్థ చెబుతోంది. తమ లిస్టెడ్ కంపెనీ అయిన పీవీపీ వెంచర్స్ అంతర్గత వనరుల నుంచి సేకరించి అప్పట్లో 131 కోట్ల రూపాయలను జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టామని వారు చెబుతున్నారు. 2016- 17 ఆర్థిక సంవత్సరం నివేదికను బట్టి జగతి పబ్లికేషన్స్లో తాము 130 కోట్ల 97 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఆ పెట్టుబడి వల్ల ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఆదాయం వచ్చినట్లు చూపకపోవడం గమనార్హం.
అప్పట్లో సెబీ జరిమానా
సంస్థ నిబంధనలు అతిక్రమించిందన్న కారణంతో అప్పట్లో సెబీ రూ.30కోట్ల జరిమానా కూడా విధించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్కు పీవీపీ లిస్టెడ్ కంపెనీ పాల్పడినట్లు నిర్దారించింది. మరోవైపు జగతి పెట్టుబడుల విషయంలో తమకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని పీవీపీ ప్రకటించుకుంది. విదేశీ సంస్థల నుంచి పీవీపీ తీసుకున్న రుణాలను చెల్లించలేదన్న అభియోగాలు కూడా ఉన్నాయి. దీంతో ప్లాటెక్స్ పై రుణ సంస్థలు కోర్టుకెక్కాయి. మారిషస్ సుప్రీంకోర్టులోను ఈ కేసు విచారణ జరుగుతోంది.