చెన్నై, రాజస్థాన్ల ఎఫెక్ట్: ఐపీఎల్లో ఫ్రాంచైజీ కోసం పొట్లూరి గ్రూప్?
హైదరాబాద్: ఐపిఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల యాజమాన్యాల పైన రెండేళ్ల నిషేధం విధించడంతో వాటి స్థానంలో కొత్త ఫ్రాంచైజీలు రావొచ్చనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఫ్రాంచైజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
పొట్లూరి వరప్రసాద్కు చెందిన పివిపి వెంచర్స్ కూడా ఫ్రాంచైజీ కోసం ప్రయత్నాలు చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. పివిపి గ్రూప్ 2012లో డెక్కన్ ఛార్జర్స్ కొనుగోలు చేసేందుకు యత్నించారు. అయితే అది వీలుకాలేదు.
ఆ ఫ్రాంచైజీని అప్పుడు సన్ టీవీ గ్రూప్ చేజిక్కించుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో, పివిపి వెంచర్స్ ఓ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తుండవచ్చునని అంటున్నారు.
అయితే, పివిపి గ్రూప్ ఇప్పటికే ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరో గ్రూప్, అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వీడియో కాన్ తదితర గ్రూపులు ప్రయత్నాలు ప్రారంభించాయనే వార్తలు వస్తున్నాయి.