జనసేనాని నీ మౌనమేలా : ఫిర్యాదుల్లో బాబు..జగన్ బిజీ : ఎన్నికల తరువాత జాడ లేని పవన్..!
ఏపిలో ఎన్నికలు ముగిసి వారం అవుతోంది. ఎన్నికల నిర్వహణ పైన చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు. వైసిపి అధినేత జగన్ సైతం తమది లాండ్ స్లైడ్ విక్టరీ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల అధినేతలు ఇలా ఉంటే..మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పోలింగ్ తరువాత ప్రజల ముందుకు రాలేదు. మరి..ఆయన దర్శనం ఎప్పుడు..
ప్రచారంలో హోరెత్తించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాన్ గత ఏడాది గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా చంద్రబాబు..లోకేశ్ అవినీతి తొలి సారిగా తీవ్ర స్థాయిలో స్పందించారు. అప్పటి నుండి దాదాపుగా ఏడాది పాటు ప్రజల మధ్యనే ఉన్నారు. అనేక చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కవాతులు నిర్వహించారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత అభ్యర్దుల ఎంపిక పైన దృష్టి సారించారు. పొత్తుల పైన అనేక ఆరోపణలు వచ్చినా ..తాము వామపక్షాలు..బిఎస్పీతో మాత్రమే పొత్తు పెట్టకుంటామని ప్రకటించారు. అదే విధంగా ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించారు. ఇక, తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసారు. తన సోదరుడు నాగబాబు అనూహ్య ఎంట్రీతో పార్టీలో చేరగా ఆయనను నర్సాపురం నుండి లోక్సభ అభ్యర్దిగా నిలబెట్టారు. అదే విధంగా జెడి లక్ష్మీనారాయణ ను విశాఖ ఎంపీగా బరిలో దించారు. ప్రచారం చివరి రోజున తాను పోటీ చేస్తున్న భీమవరం లో ఎన్నికల సభలో పాల్గొన్నారు.
ఓటు వేసారు..ఆ తరువాత
పోలింగ్ నాడు జనసేన అధినేత పవన్ కళ్యాన్ విజయవాడలోని పటమట సెంటర్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పటికే ఇవియంల పని తీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి స్పందనగా తాను ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం వరకు ఇదే రకంగా ఇవియంల పైన ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అర్దరాత్రి వరకు పోలింగ్ జరిగింది. దీని పైనా పవన్ ఎక్కడా స్పందించలేదు. మరుసటి రోజు ఒక అధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లిపోయారు. పోలింగ్ శాతం పెద్ద ఎత్తున నమోదు కావటం..ఇవియంల పైన ఫిర్యాదులు రావటం.. పోలింగ్ లో హింసాత్మక ఘటనలు..మహిళలు అర్దరాత్రి వరకు క్యూలో ఉండి ఓట్లు వేయటం వంటి వాటి పైనా స్పందించలేదు. ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపలేదు. నేరుగా కాకున్నా..కనీసం ట్విట్టర్ ద్వారా కూడా పవన్ స్పందించక పోవటం పై చర్చ మొదలైంది.
బాబు..జగన్ ఫిర్యాదుల్లో బిజీ..
పవన్ వారం రోజులుగా పోలింగ్ సరళి పైనా..తమ అంచనాల పైనా ఎక్కడా మాట్లాడ లేదు. ఇదే సమయంలో టిడిపి అధినేత ఇవియంల లోపాల పైన ఎన్నికల సంఘాన్ని తప్పు బడుతూనే..మరో వైపు తాము ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి ఎవరికీ అర్దం కాదని..సైలెంట్ పోలింగ్ తమకే ప్రజలు పట్టం కట్టారని చెబుతున్నారు. ఇక, వైసిపి అధినేత జగన్ సైతం ఓట్లు పెద్ద ఎత్తున వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు లాండ్ స్లైడ్ విక్టరీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇక, పోలింగ్ రోజు నుండి ఇప్పటి వరకు అధికార పార్టీ నేతల పై కేసులు నమోదు చేయకపోవటాన్ని నిరసిస్తూ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసారు. ఈ ఇద్దరు ఇలా ఉంటే.. పవన్ కళ్యాన్ మాత్రం తమ పార్టీ అంచనాల పైనా..పోలింగ్ సరళి మీద మాత్రం స్పందించక పోవటం పై జనసేన కార్యకర్తల్లోనే చర్చ సాగుతోంది.