జగన్పై దాడి: తప్పుదోవ పట్టిస్తున్న బాబు, భయపెడతారా?: శివాజీకే అప్పగించండంటూ పైడికొండల
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు తీవ్రంగా ఖండించారు. జగన్పై దాడి జరిగితే మీరు స్పందించే తీరు ఇదా? అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు.
'చంపాలనే దాడి, జగన్ తప్పించుకున్నారు': విమానాశ్రయంలో ఏం జరిగిందంటే..?
చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు..
కాకినాడలో పైడికొండల మాణిక్యాల రావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపిస్తేనే ప్రజలు నిజాలు తెలుస్తాయని అన్నారు. జగన్పై జరిగిన దాడి ఆయన అభిమానే చేశాడని, చిన్న గాయమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు.
ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసి..
ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో సంచరించడానికి భయపడే పరిస్థితులను ధ్వజమెత్తారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతంలో విశాఖ విమానాశ్రయంలో రన్ వేపైనే రాష్ట్రానికి చెందిన పోలీసులు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారని గుర్తు చేశారు.
శివాజీ చెప్పిందే నిజమైతే మీరెందుకు?
ఆపరేషన్ గరుడ అంటూ సినీనటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే.. ఎందుకు మీ ప్రభుత్వం.. మీ పోలీసు వ్యవస్థ.. జగన్పై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయిందని చంద్రబాబును మాణిక్యాల రావు ప్రశ్నించారు. ఒకవేళ శివాజీ చెప్పిందే నిజమైతే దాడి మీ ఫెయిల్యూర్గా భావించి మీరు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేసి ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
శివాజీని విచారించేందుకు భయపడుతున్నారా?
ఇప్పటికైనా శివాజీని అరెస్ట్ చేసి ఆపరేషన్ గరుడ వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఒక వేళ ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే దీని వెనకున్న పెద్దలకు, మీ ప్రభుత్వానికి నష్టమని భయపడుతున్నారా? అని చంద్రబాబును మాణిక్యాలరావు నిలదీశారు.