టీడీపీ నేతలకు క్వారంటైన్ భయం- చంద్రబాబు ఆందోళన- వ్యూహం మార్చిన జగన్...?
ఏపీలో వైసీపీ సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి వివిధ అంశాల్లో తమ భయాన్ని వ్యక్తం చేస్తున్న విపక్ష టీడీపీ తాజాగా మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా టెస్టులపైనే టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేతలను వేధించేందుకు ప్రభుత్వం కరోనా టెస్టులతో పాటు క్వారంటైన్ ను వాడుకుంటోందని అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లలాట..కరోనా పరీక్షల విశ్వసనీయత ఇదేనా : నారా లోకేష్
చంద్రబాబు కొత్త ఆరోపణ...
ఇన్నాళ్లూ టీడీపీ నేతలను నయానో, భయానో లొంగదీసుకునేందుకు వైసీపీ సర్కారు, సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేసిన విపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు రూటు మార్చారు. ప్రభుత్వం మాట వినని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తోందని ఇన్నాళ్లూ ఆరోపించిన చంద్రబాబు.. తాజాగా మరో విషయాన్ని బయటపెట్టారు. కరోనా టెస్టులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం విపక్ష టీడీపీ నేతలను టార్గెట్ చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డికి బలవంతంగా క్వారంటైన్ కు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చంద్రబాబు తాజాగా ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
నెగెటివ్ వచ్చినా పాజిటివ్ అంటారా ?
ప్రభుత్వాన్ని తరచూ విమర్శిస్తున్న, కేసులు పెడుతున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని వైసీపీ కావాలనే లక్ష్యంగా చేసుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. అందుకే కరోనా టెస్టులు నిర్వహించి నెగెటివ్ వచ్చినా పాజిటివ్ అని చెప్పి క్వారంటైన్ కు పంపేందుకు ప్రయత్నించారని టీడీపీ అధినేత ఆరోపించారు. దీంతో కరోనా టెస్టుల విశ్వసనీయతే ప్రశ్నార్ధకంగా మారిందని చంద్రబాబు విమర్శలు చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వం కరోనా కిట్ల కొనుగోళ్లలో అక్రమాలు చేసిందని, ఇప్పుడు ఏకంగా టెస్టుల నిర్వహణలోనే అన్యాయంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
Recommended Video
జగన్ వ్యూహం మారిందా ?
ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పేరుతో టీడీపీ నేతలను జైళ్లకు పంపిన వైసీపీ సర్కారు... తాజాగా చంద్రబాబు ఆరోపణలను బట్టి చూస్తే వారిని కరోనా టెస్టుల పేరుతో క్వారంటైన్ కు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినందుకు నిరసనగా రోడ్లపై ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే చింతమనేనితో పాటు మరికొందరు ఉన్నారు. తాజాగా కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా పాజిటివ్ అని చూపించి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని క్వారంటైన్ కు పంపేందుకు ప్రయత్నించడం టీడీపీలో కలకలం రేపుతోంది. పార్టీ నేతలను చిన్నాచితకా కేసుల్లో అరెస్టులు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం...క్వారంటైన్లకు పంపడం ద్వారా వారిని భయబ్రాంతులకు గురి చేస్తోందని టీడీపీ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.