దొలేరా, గుజరాత్పై మోడీని ప్రశ్నించే దమ్ముందా?: పవన్ కళ్యాణ్-జగన్లకు దేవినేని
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు గుజరాత్ దొలేరాపై కేంద్రాన్ని నిలదీసే దమ్ముందా అని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. దొలేరా నగరానికి, గుజరాత్ రాష్ట్రానికి ప్రధాని మోడీ ప్రభుత్వం రూ.వేల కోట్లు తరలిస్తోందని, దీనిని వారు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
దొలేరాకు తరలింపుపై ప్రశ్నించే దమ్ము, ధైర్యం వారికి ఉందా అన్నారు. వైసీపీ, జనసేన, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. జగన్ గతంలో జైలు నుంచి బయటకు రావడానికి కాంగ్రెస్తో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో దోస్తీకి సిద్ధమయ్యారన్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైతే, సాక్షి దినపత్రికలో ఆ వార్తలను ప్రాధాన్యం లేకుండా ప్రచురించారన్నారు. వైసీపీకి, బీజేపీతో బంధం ఏమిటో చెప్పాలన్నారు. వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమైన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారన్నారు.
జగన్ పాదయాత్ర మార్నింగ్, ఈవినింగ్ వాక్లా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కాశీ వరకూ పొడిగిస్తే పుణ్యం దక్కుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,400 కోట్లు కేంద్రం నుంచి బిల్లులు రావాల్సి ఉందన్నారు. ఈ నెల 11న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ను సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. దీనిపై ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ వస్తుందన్నారు.
కాగా, దొలేరాకు ఇచ్చిన నిధులపై ఏపీ టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని బీజేపీ చెబుతోంది. దొలేరాకు కేంద్రం రూ.44వేల కోట్లు ఖర్చు చేస్తుందని టీడీపీ నేతలు చెప్పగా, కానీ కేంద్రం రూ.3వేల కోట్లు మాత్రమే ఇస్తోందని, మిగతా డబ్బు గుజరాత్ సమకూర్చుకుంటుందని, రూ.3వేల కోట్లలో భాగంగా రూ.1293 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చిందని చెబుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం మొత్తం డబ్బులు కేంద్రమే ఇచ్చినట్లు చెప్పడాన్ని బీజేపీ ఖండిస్తోంది.