పవన్ కళ్యాణ్! చిచ్చు పెడతావా?, ఇదీ లెక్క.. చూసుకో: 'పవర్ స్టార్' లోకేష్ అంటూ
అమరావతి/కడప: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే తమపై అవినీతి ఆరోపణలు చేయడం కాదని, సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలని మంత్రి నారాలోకేష్ శనివారం సవాల్ విసిరారు. అంతేకాదు, పదేపదే నిత్యం ఏపీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబును విమర్శించడం మాని, విభజన హామీలు అమలు చేయని కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ తనలాంటి యువతను ప్రోత్సహించాలన్నారు. లోకేష్ నెల్లూరలో జరిగిన దళిత తేజం-టీడీపీ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. తన తాత ఎన్టీఆర్, నాన్న చంద్రబాబు అంత పేరు తెచ్చుకుంటానో లేదో కానీ వారికి చెడ్డపేరు మాత్రం తీసుకు రానని చెప్పారు. తనపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు వేగాన్ని అందుకోలేకపోతున్నా
మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ వయసులోనూ చంద్రబాబు కష్టపడుతున్నారని, నేను చంద్రబాబు వేగాన్ని అందుకోలేకపోతున్నానని లోకేష్ అన్నారు. మచ్చలేని మన చంద్రన్నపై కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవర్ స్టార్ పవర్ ఫుల్గా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారనుకున్నామని, కానీ, చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఓ వైపు జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్
ఓ వైపు జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్లకు దమ్ముంటే కేంద్రంపై పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టాలని లోకేష్ అన్నారు. ఎన్నికల వేడి ప్రారంభమైందని, బీజేపీ నేతలు మనముందుకు వస్తారని, బీజేపీలో బీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్ పార్టీ, పీ అంటే పవన్ పార్టీ అన్నారు. ముగ్గురూ కుమ్మక్కై మనపై విషప్రచారం చేస్తున్నారన్నారు.
బీజేపీ నేతలు అన్నాక పవన్ కళ్యాణ్ నోట అదే
కులం పేరుతో ఏమీ సాధించలేమని అంబేడ్కర్ చెప్పారని లోకేష్ అన్నారు. కష్టపడి ప్రయోజకులుగా మారాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు కులం, మతం, ప్రాంతం వాడి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుపై అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఎన్డీయే నుంచి బయటకు రాగానే బీజేపీ నేతలు కర్నూలుకు వెళ్లి డిక్లరేషన్ అన్నారని, ఇటీవల పవన్ ఉత్తరాంధ్రకు వెళ్లి డిక్లరేషన్ అంటున్నారని, ఇది ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం కాదా అని నిలదీశారు.
అన్నీ తెచ్చే బాధ్యత మాదే
వచ్చే ఎన్నికల్లో 25 లోకసభ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని లోకేష్ అన్నారు. అలాగైతే ప్రధాని ఎవరో మన చంద్రబాబు నిర్ణయించబోతున్నారని, తద్వారా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న 18 హామీలను తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని, ఎవరైనా మీ కులం, మతం, ప్రాంతం ఏదని అడిగితే ఆంధ్ర అని చెప్పాలన్నారు. చివరకు జై భీమ్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఆరోపణలు లేని ఆరోపణలతో నష్టం చేయకు
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురదజల్లి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయొద్దని పవన్ను లోకేష్ ట్విట్టర్లో కోరారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు చంద్రబాబుపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, కనీస ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసి రాష్ట్రానికి వచ్చే కంపెనీలను భయపెట్టి లక్షల మంది యువత భవిష్యత్తును దెబ్బతీయొద్దన్నారు. విభజన అనంతరం ఐటీలో 24వేలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 18వేల ఉద్యోగాలను కల్పించామన్నారు. పవన్ తన పర్యటనలో వేసిన ప్రశ్నలకు లోకేష్ ట్వీట్ ద్వారా సమాధానం చెప్పారు.