రిజైన్ చేసి అడగండి: టి మంత్రులకు టిజి, కిరణ్పై కొండ్రు
హైదరాబాద్/శ్రీకాకుళం: శాఖ మారిందని తెలంగాణ ప్రాంత మంత్రులు గోల చేయడం సరికాదని, ఇష్టం లేకుంటే రాజీనామా చేయాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై టిజి స్పందించారు.
తెలంగాణ ప్రాంత మంత్రులు శాఖ మార్పును రాద్దాంతం చేయవద్దన్నారు. ఇష్టం లేకుంటే రాజీనామా చేసి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీయాలన్నారు. మంత్రివర్గంలో ఉంటూ ప్రశ్నించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన శాఖలను విస్మరించి శాఖ మారిందని గోల చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో లోపాలున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావే చెబుతున్నారని కాబట్టి దానిని తెరాస తిరస్కరించాలన్నారు.
సమైక్యవాదమేనని ఝాన్సీ, కిరణ్కు కొండ్రు మద్దతు
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలది సమైక్యవాదమేనని పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. మంత్రి కొండ్రు మురళి ముఖ్యమంత్రికి మద్దతు పలికారు. శాఖ మార్పు విషయంలో కిరణ్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.
సమైక్యవాదమే: గాలి
సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలది సమైక్యవాదమేనని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. రేపటి ఎపిఎన్జీవోల బందుకు తాము మద్దతిస్తామన్నారు. బిల్లులోని ప్రతి క్లాజు పైన ఓటింగ్ అడుగుతామన్నారు. శ్రీధర్ బాబు శాఖ మార్పును స్వాగతిస్తున్నామని టిడిపి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు.
ఒప్పుకోం: సాయిప్రతాప్
రాష్ట్ర విభజనకు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని సాయి ప్రతాప్ కడప జిల్లాలో అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఓడిస్తామని, 2014 సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు.