బాబుకు ఆర్ కృష్ణయ్య షాక్: ఏపీలో మరో కొత్త పార్టీ, కారణం ఇదే!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గుంటూరు: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భవిష్యత్లో బీసీల కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నామని ఆయన ప్రకటించారు.
కొత్త పార్టీతో ముందుకు..
అంతేగాక, త్వరలోనే పార్టీపై కార్యచరణ రూపొందించి నిర్ణయం తీసుకుంటామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. తిరుపతి, విశాఖ, గుంటూరు, అనంతపురం, కర్నూలు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు.
ఇదే డిమాండ్
పాత గుంటూరులో నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కృష్ణయ్య.. చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 56శాతం ఉన్న బీసీలకు ఏ రాజకీయ పార్టీ కూడా సీట్లు ఇవ్వడం లేదన్నారు.
అందుకకు వ్యతిరేకం..
గ్రామస్థాయి నుంచి భవిష్యత్లో రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. కాపులను బీసీల్లో చేర్పించేందుకు తీసుకుంటున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టంచేశారు.
మరో తలనొప్పి..
బీసీ రిజర్వేషన్లకు అర్హత.. సాంఘిక, విద్యా రంగాల్లో వెనుకబాటుతనమేనని కృష్ణయ్య అన్నారు. కేంద్రంలో ఉన్న 14లక్షలు, రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో సతమతమవుతున్న చంద్రబాబుకు కృష్ణయ్య మరో తలనొప్పి అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.