నన్ను సీఎంను చేస్తానంటే టిడిపిలో చేరా: కృష్ణయ్య, కాపు అంశంపై బాబుకు కితాబు
హైదరాబాద్: తనకు తెలుగుదేశం పార్టీతో పూర్తిగా అటాచ్ లేదని, అలాగని డిటాచ్ లేదని, తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే తాను తెలుగుదేశం పార్టీ తరఫున గత సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తెలంగాణ టిడిపి తరఫున సమావేశాలు జరిగితే తాను వెళ్తానని చెప్పారు. అయితే తాను బీసీల తరఫున ఎవరితోనైనా పోరాడుతానని చెప్పారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి అని నాడు చంద్రబాబు చెప్పారని, తద్వారా తమకు న్యాయం జరుగుతుందనే తాను అప్పుడు పోటీ చేశానని అభిప్రాయపడ్డారు.
తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే ఎవరితోనైనా పోరాడుతానని చెప్పారు. తన సామాజిక వర్గానికి మంచి చేస్తే అధికార పార్టీ అయినా, ఎవరైనా తాను వారితో బాగానే ఉంటానని చెప్పారు. అంతిమంగా తన వర్గం బాగు తనకు ముఖ్యమని చెప్పారు.
కాపుల్లో అత్యంత బీదరికం అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారని, వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలనడంలో సందేహం లేదని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. కాపులను బీసీల్లో కలిపేందుకు మాత్రం ససేమిరా అన్నారు.
నేడు కాపులను కలిపితే, రేపు రెడ్లు, బ్రాహ్మలు, కమ్మలు, వైశ్యులు కూడా వస్తారని, అప్పుడిక బీసీలకు అర్థమేమిటన్నారు. అన్ని కులాల్లోనూ పేదలున్నారని వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఏ కులానికి రిజర్వేషన్లు కల్పించినా అది శాస్త్రబద్ధంగా, ఓ పద్ధతి ప్రకారం జరగాలన్నారు.
గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాపులను బీసీల్లో కలిపితే హైకోర్టు కొట్టి వేసిందన్నారు. తాను డబుల్ గేమ్ను ఆడటంలేదని, తన జాతి కోసం చేస్తున్న పోరాటమిదని అన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.
గత నలభై ఏళ్లుగా బలహీనవర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్నానని ఆయన చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సీఎంగా తనను చేస్తానని మాటిచ్చిన మీదటే, ఆ పార్టీలో చేరాను తప్ప, తనకు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదన్నారు.
తాను ముఖ్యమంత్రి అయితే బీసీ జాతి అభివృద్ధి చెందుతుందన్న ఒకే కారణంతో టిడిపిలో చేరానని, తాను టిడిపిలోనే ఇష్టం లేకుండా చేరానని, ఇక మరో పార్టీ తీర్థం అనే దానికి అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. బీసీల్లో ఒకడిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తాను టెక్నికల్గా మాత్రమే ఎమ్మెల్యేనని అన్నారు.