ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు చేదు, బాబుపై జగన్ పార్టీ
న్యూఢిల్లీ/ఖమ్మం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు బుధవారం ఖమ్మం కోర్టు వద్ద చేదు అనుభవం ఎదురయింది. ఓ పరువు నష్టం కేసులో ఆయనకు అరెస్టు వారెంటు జారీ అయింది. దీంతో రాధాకృష్ణ ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరయ్యారు.
సదరు కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ చుక్కెదురయింది. దీంతో ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. ఇక్కడ అతనిని తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి అడ్డుకుంది.
నాడు తెలంగాణ ఉద్యమం పైన విషం చిమ్మావని, నేడు తెలంగాణ ప్రభుత్వం పైన విషం చిమ్ముతున్నావని న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనను నిలదీశారు. దీంతో ఆంధ్రజ్యోతి సిబ్బంది, న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాగా, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నరేంద్ర 2010లో కోర్టులో కేసు దాఖలు చేశారు.
తెలంగాణలో టీవీ9 ప్రసారాలు పునరుద్ధరించండి
తెలంగాణ రాష్ట్రంలో టీవీ9 చానల్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని టెలికాం ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు నవంబర్ 7వ తేదీలోపు తమ ఆదేశాలను అమలు చేస్తామంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అటు, కేబుల్ ఆపరేటర్లకు తగిన రక్షణ కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని టెలికాం ట్రైబ్యునల్ పేర్కొంది.
రైతులను నట్టేట ముంచారు: వైయస్సార్ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ రైతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆరోపించింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన ఆ పార్టీ చిత్తూరు జిల్లా శాఖ సమీక్షలో భాగంగా పార్టీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆ పార్టీ నేతలు విజయ సాయిరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు ఆరోపించారు. చంద్రబాబు పాలనపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజల పక్షాన తమ పార్టీ పోరు సాగిస్తుందని వారు వెల్లడించారు. బాబు సర్కారు తీరుకు నిరసనంగా నవంబర్ 5న అన్ని మండల కేంద్రాల్లో నిరసన చేపడతామన్నారు.