జగన్ ఉండగా రాలేనేమో-ఏం చేయాలో పాలుపోలేకే రిటర్న్-రఘురామ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే దాదాపు మూడేళ్లుగా పోరాటం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ మధ్యకాలంలో చేయని విమర్శలు లేవు. దీంతో వైసీపీ సర్కార్ కూడా రఘురామ తీరుపై గుర్రుగా ఉంది. దీని ప్రభావం ఆయన ఏపీకి తిరిగి రాలేని స్ధాయికి తీసుకెళ్లింది. దీంతో ఢిల్లీకే పరిమితం అవుతున్న రఘురామ.. నిన్న భీమవరంలో ప్రధాని మోడీ టూర్ కు కూడా రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
మోడీ టూర్ కు రఘురామ దూరం
నిన్న భీమవరంలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వచ్చారు. అదే సమయంలో ఢిల్లీ నుంచి తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడం రఘురామ సత్తాకు పరీక్షగా నిలిచింది. అయితే అందులో ఆయన విఫలమయ్యారు. ప్రధాని కార్యాలయం పంపిన జాబితాలో ఆయన పేరు లేకపోవడం, మరోవైపు సీఐడీ పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న భయాలతో రఘురామ హైదరాబాద్ లోనే ఉండిపోయారు. అయితే ఆ తర్వాత తాజా పరిణామాలపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఉండగా రాలేనేమో?
రాష్ట్రంలో మూడేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించి ఢిల్లీకే పరిమితమవుతున్న రఘురామరాజు.. ఆప్పటి నుంచి ఏపీకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా విఫలమయ్యారు. తాజాగా భీమవరానికి కూడా రాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలో ఉండగా.. తాను రాలేనేమో అంటూ రఘురామ నిర్వేదం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ తనకు కల్పిస్తున్న అడ్డంకుల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఐడీ అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా భీమవరం రాలేకపోవడంపై రఘురామ ఇలా స్పందించారు.
రఘురామ ఫ్యాన్స్ పై చిత్రహింసలు
మరోవైపు రఘురామ భీమవరం టూర్ కు వస్తున్నారని తెలిసి స్ధానికంగా ఆయనకు ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నించిన యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న రఘురామ.. చేసేదేమీ లేక హైదరాబాద్ లోనే ఉండిపోయారు. దీనిపై తర్వాత స్పందించిన రఘురామ.. తన అభిమానుల్ని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. ఎంపీని ఏమీ చేయలేం కానీ మిమ్మల్ని ఉతికేస్తాం అంటూ బెదిరించారని తెలిపారు. చదువుకుంటున్న తన ఇద్దరు కొడుకుల్ని పోలీసులు ఎక్కడికో తీసుకెళ్లిపోయారని ఓ తండ్రి తనకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని రఘురామ తెలిపారు.
ఏం చేయాలో పాలుపోక వెనుదిరిగా..
మరోవైపు తాను హైదరాబాద్ వరకూ వచ్చి వెనుదిరగడానికి గల కారణాల్ని కూడా రఘురామ వెల్లడించారు. ఓవైపు తన పేరు ప్రధాని టూర్ లో లేకుండా చేశారని, మరోవైపు తన అభిమానుల్ని హింసించారని, పోలీసులు పెడుతున్న ఇబ్బందుల్ని వారు పోన్లో చెబుతుంటే ఏం చేయాలో పాలుపోక ప్రధాని సభకు రాకుండా వెనుదిరిగినట్లు రఘురామ వెల్లడించారు. ఈ దేశంలో ఓ ఎంపీ బతకలేని పరిస్ధితుల ఉంటే ఇక సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు. పోలీసుల్ని వాడుకుని తనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.