కొంపముంచిన రహస్య ఒప్పందం, తగ్గిన ప్రాధాన్యం : జనసేనకు రాఘవయ్య గుడ్ బై
అమరావతి : ఏపీలో ఎన్నికలు ముగిసి .. ఫలితాల కోసం వేచిచూస్తోన్న తరుణంలో జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుండగా .. తాజాగా జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఇదివరకు పీఆర్పీలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు.
రాజీనామా
జనసేన పార్టీకి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో రాఘవయ్య పేర్కొన్నారు. కోశాధికారి, జనసేన ప్రాథమిక సభ్యత్వం .. అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెలువడకముందే రాజీనామాల పర్వం కొనసాగుతుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ముందు నుంచి ఉన్నవారిని పట్టించుకోకుండా కొత్తవారికి ప్రయారిటీ ఇవ్వడంతోనే నేతలు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
నచ్చని రహస్య సంబంధాలు
దీనికితోడు టీడీపీతో జనసేన రహస్య సంబంధం నచ్చకే నేతలు దూరమవుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా రాఘవయ్య పార్టీని వీడటానికి కూడా అదే కారణమని తెలుస్తోంది. రాఘవయ్యతోపాటు మరో నేత అర్జున్ కూడా పార్టీ క్రియాశీలక పదవులకు రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.
తగ్గిన ప్రాధాన్యం
పీఆర్పీలోనూ కీ రోలో పోషించిన రాఘవయ్య .. జనసేనలో కూడా ముఖ్యభూమిక పోషించారు. అయితే ఇటీవల రాఘవయ్యను అధినేత పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.