గల్లా జయదేవ్ మీటింగ్: కె రాఘవేంద్ర రావు డైరెక్షన్
గుంటూరు: తెలుగుదేశం పార్టీలో చేరిన గల్లా జయదేవ్ బుధవారం తొలిసారి గుంటూరు జిల్లాకు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు ఈ ఏర్పాట్లను పరిశీలించడం విశేషం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సాయంత్రం గుంటూరు పార్లమెంటు పరిధిలోని పార్టీ నాయకుల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై దర్శకేంద్రుడు నాయకులతో చర్చించారు.
గుంటూరు లోకసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ అమర్రాజా సంస్థ వైస్ ఛైర్మన్ గల్లా జయదేవ్ మధ్యాహ్నం జిల్లాలో తొలి అడుగు పెట్టనున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద జిల్లాలోకి అడుగు పెట్టనున్న ఆయన అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. ఆయన అభిమానులు, సన్నిహితులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
సాయంత్రం ఎన్టీఆర్ భవన్లో జరిగే సభలో ఆయన తొలి ప్రసంగం చేస్తారు. జయదేవ్ ర్యాలీ ఏర్పాట్లను కె రాఘవేంద్ర రావు దగ్గరుండి పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ తరుపున గుంటూరు లోకసభ స్థానానికి గల్లా జయదేవ్ పేరు గత నాలుగు, ఐదు నెలలుగా ప్రచారంలో ఉన్నది.
చంద్రబాబు కూడా పార్టీ జిల్లా నేతలతో చర్చించి జయదేవ్కు పచ్చజెండా ఊపారు. గత రెండు నెలలుగా జయదేవ్ రాజకీయ అరంగేట్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల తన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారితో కలిసి హైదరాబాద్లో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కారు.