కన్నంలో పడ్డ దొంగ: చంద్రబాబుపై రాఘవులు, కెసిఆర్పైనా..
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కన్నంలో పడ్డ దొంగలా దొరికిపోయాడని సిపిఎం సీనియర్ నేత బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.
అవినీతి కేసు బయటపడేందుకు చంద్రబాబు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇదే అదునుగా ఓటుకు నోటు వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని రాఘవులు ఆరోపించారు.
ఓటుకు నోటు కేసులో కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు.
కోర్టులు చెప్పినా వినడం లేదు: వైయస్సార్ కాంగ్రెస్
దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పథకాలకు తూట్లు పొడిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన ఉందని వైయస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు.
ప్రజా సంక్షేమ పథకాలకు ఆధార్తో ముడివేయడం సరికాదని అన్నారు. ఇదే విషయంపై ఇప్పటికే పలుసార్లు న్యాయ స్థానాలు తీర్పులిచ్చినా ఆధార్ తప్పనిసరి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, గృహ నిర్మాణ పథకాలకు ఆధార్తో లింక్ పెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ లింకుపై గోల చేసిన చంద్రబాబు ఇప్పుడెందుకు మరి ఆధార్తో ముడిపెడుతున్నారని నాగార్జున నిలదీశారు.