టార్గెట్ విజయ సాయిరెడ్డి : పార్టీకి భారీ నష్టం చేస్తున్నారు..ఏం జరిగిందంటే : సీఎం జగన్ కు రఘురామ లేఖ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు వరుస లేఖల్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖాస్త్రం సంధించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు..అమలు స్థితిలను వివరిస్తూ వాటిని పూర్తి చేయాలని సూచిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఇక పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖ రాసారు. దాదాపు పది రోజులుగా రఘురామ రాజు వరుసగా సీఎంకు లేఖలు రాస్తున్నారు. ఇక, ఈ రోజు రాసిన లేఖలో పూర్తిగా విజయ సాయి రెడ్డి తీరును తప్పు బడుతూ ఆయన వలన పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
సాయిరెడ్డిని నియంత్రించండి..
మన్సాస్ ఛైర్మన్ గా తిరిగి అశోక్ గజపతి రాజును నియమిస్తూ హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకొంటున్నారని ఆయనను వెంటనే అదుపు చేయాలని లేఖలో కోరారు. అశోక్గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు. మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు సైతం ఇచ్చింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి అశోక్గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అదుపులో పెట్టాలి..అంటూ రఘురామ రాజు లేఖలో కోరారు. అశోక్ గజపతి పైన సాయిరెడ్డితో పాటుగా పలువురు వైసీపీ నేతలు సైతం తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని..వారిని నియంత్రించాలని సూచించారు.ఆయన పైన ఆ తరహా వ్యాఖ్యలు సరి కాదని పేర్కొన్నారు.
2014 పరిస్థితులు తిరిగి రాకుండా..
విజయసాయిరెడ్డిని, మంత్రులను పార్టీ భవిష్యత్ కోసం నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో దాగున్న భావోద్వేగం వెల్లువెత్తి 2014 పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానంటూ లేఖలో చెప్పుకొచ్చారు. రఘురామ రాజు వరుసగా రాస్తున్న లేఖల పైన వైసీపీ నేతలు స్పందించటం లేదు. అయితే, తాజాగా మాన్సాస్ ట్రస్టు విషయంలో అశోక్ గజపతి రాజు పైన విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా వేడి పుట్టించాయి.
Recommended Video
సాయిరెడ్డి వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్..
ఆయన హాయంలోనే మాన్సస్ లో అక్రమాలు జరిగాయని..ఆడిటింగ్ చేయనప్పుడు పారదర్శకత ఏమైందని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఆయన హయాంలోనే విగ్రహాలు ధ్వసం అయినాయంటూ చెప్పుకొచ్చారు. అశోక్ గజపతి రాజు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో... ఉత్తరాంధ్రలో ఇప్పుడు అశోక్ గజపతి రాజు - మాన్సాస్ ట్రస్టు కేంద్రంగా రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఇక, ఇప్పుడు అశోక్ గజపతి రాజుకు మద్దతుగా రఘురామ రాజు లేఖ రాయటం..విజయ సాయిరెడ్డి ని కంట్రోల్ చేయమంటూ అందులో సూచించటంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.