భారీ ట్విస్ట్: మళ్లీ గుంటూరుకు రఘురామ: బెయిల్ పై విడుదల అయినట్లు కాదు : ఏం జరగబోతోంది
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన రెబల్ ఎంపీ రఘురామ రాజు ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా సీఐడి కోర్టు ఆయన విషయంలో తేల్చిన అంశాలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. రఘురామకృష్ణరాజు బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించారని సీఐడీ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రఘురామకృష్ణరాజుకు మే 21న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం ఆయన గుంటూరు జైలుకు వచ్చి బెయిల్ పత్రాలపై సంతకం చేసి బెయిల్పై విడుదల కావాల్సి ఉంది.
సంతకాలు లేని కారణంగా..
కానీ, ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ..బెయిల్ షరుతల ప్రకారం రూ లక్ష విలువైన షూరిటీలను సీఐడి న్యాయస్థానంలో సమర్పించారు. వాటిని అదేరోజున న్యాయస్థానం ఫారం-43తో సహా గుంటూరు జైలుకు పంపించింది. వాటిపై నిందితుడి సంతకం తీసుకుని సమర్పించాలని ఆదేశించింది. అందుకోసం రఘురామకృష్ణరాజు గుంటూరు జైలుకు రావాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆయన సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. దాంతో రఘురామ సంతకం లేని పత్రాలను గుంటూరు జైలు సూపరింటెండెంట్ ఈ నెల 10న సీఐడీ న్యాయస్థానానికి సమర్పించారు. బాండ్ పత్రాలపై నిందితుడు సంతకం చేయనందున ఆయన జైలు నుంచి బెయిల్పై విడుదల అయినట్టు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనపై రిమాండ్ వారెంట్ మనుగడలో ఉన్నట్టుగానే భావిస్తున్నామని కూడా తేల్చిచెప్పింది.
రఘురామ రిమాండ్ పొడిగింపు..
కాబట్టి ఎంపీ రఘురామ రిమాండ్ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. గత నెల 24న రఘురామ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయి నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా జైలు నుండి రఘురామ సంతకాలు చేయాల్సిన పత్రాలు ఆర్మీ ఆస్పత్రికి చేరే సమయానికే ఆయన డిశ్చార్జి అయి ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో..తాజాగా అందుతున్న సమాచారం మేరకు రిలీజ్ ఆర్డర్ పైన సంతకాలు చేయని రఘురామ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నట్లుగా జైలు అధికారులు భావిస్తున్నారు. ఆయన పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా జైలు అధికారులు ఎస్పీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
తిరిగి గుంటూరుకు తీసుకొస్తారా..
దీంతో..ఆయనను గుంటూరు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ, ఇదే సమయంలో రఘురామ న్యాయవాది మాత్రం తాము పూర్తిగా చట్టప్రకారం నడుచుకున్నామని చెబుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు బెయిల్ మంజూరైన తర్వాత ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని చెప్పుకొచ్చారు. సీఐడీ కోర్టు ఆయన రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలిచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తాము సుప్రీం కోర్టునే ఆశ్రయిస్తామని రఘురామ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనే ఆసక్తి నెలకొని ఉంది.