భారతీ రెడ్డి పేరుతో సాక్షికి రఘురామ నోటీసులు : క్షమాపణ చెప్పాలి : 50 కోట్ల పరువునష్టం..!!
ముఖ్యమంత్రి జగన్ కుటుంబం మేనేజ్ మెంట్ లో నడుస్తున్న సాక్షి మీడియా గ్రూపుకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే సాక్షి యాజమాన్యంకు రఘురామ తరపు న్యాయవాది నోటీసులు ఇచ్చారు. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా అనేక కథనాలు ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఆ నోటీసలో పేర్కొన్నారు.
మరోసారి భారతీరెడ్డి పేరుతో నోటీసులు..
మరలా ఈ రోజు ఇచ్చిన నోటీసులోనూ తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వకుంటే.. 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ భారతీ రెడ్డితో సహా సాక్షి మీడియాలో కీలక స్థానాల్లో ఉన్న పలువురి పేర్లతో నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసుతో పాటుగా తన పైన ప్రసారమైన కధనాలను సైతం జత చేసినట్లు సమాచారం. రఘురామ రాజు వైసీపీ అధినాయకత్వం పైన విమర్శలు ప్రారంభించిన సమయం నుండి వైసీపీ నేతలు ఆయన్న టార్గెట్ చేసారు.
సీఐడీ కేసుతో తారా స్థాయికి..
రఘురామ పైన తాజాగా సీఐడి సెమోటోగా కేసు నమోదు..ఆ తరువాత కస్టడీలో తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ రఘురామ ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాసారు. ఇప్పుడు వరుసగా సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. అయితే, రఘురామ రాజు మీడియా సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసి..ఆయనతో కలిసి కుట్ర చేసాయంటూ రెండు మీడియా సంస్థల పైన సీఐడి రఘురామ కేసులో అభియోగాలు మోపింది. రఘురామ రాజు మరో వైపు సాక్షి లక్ష్యంగా నోటీసులు ఇస్తున్నారు.
Recommended Video
ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా..
మరి...ఇప్పుడు రఘరామ నోటీసుల పైన సాక్షి యాజమాన్యం స్పందిస్తుందా.. ఏ రకంగా సమాధానం ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. రఘురామ రాజు పైన తాము రెండో సారి ఫిర్యాదు చేసిన తరువాత స్పీకర్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని..త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ అవుతాయనే నమ్మకం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. కానీ, రఘురామ రాజు మాత్రం తన పైన అనర్హత వేటు పడదనే ధీమాతో కనిపిస్తున్నారు. ఇలా ఎవరి నమ్మకంతో వారున్న ఈ సమయంలో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలు కీలకంగా మారనున్నాయి.