గంపగుత్త కుదరదు: ఎపి, టీలపై రఘురామ్ రాజన్ పైర్
ముంబై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించిన రుణ మాఫీపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లో కూడా రుణాలను రీషెడ్యూలు చేయాల్సిన పరిస్థితులు ఏమీ లేవన్నారు. ఒకవేళ రీషెడ్యూలు చేసినా గంపగుత్తగా చేయబోమని, అవసరమైన జిల్లాల్లో మాత్రమే చేస్తామని రాజన్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఒక పద్ధతి పాటించకుండా రుణమాఫీ హామీ ప్రకటించారని అభిప్రాయపడ్డారు.
నిరుడు సంభవించిన ఫైలిన్ తుఫానులో రుణాలు మాఫీ చేయాల్సినంత విస్తృత స్థాయిలో పంటలు దెబ్బతినలేదని అన్నారు. అప్పట్లో ఒక్క జిల్లా కలెక్టర్ కూడా పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించలేదని చెప్పారు. రుణాలు రీషెడ్యూలు చేయాలని ఒక్కరూ కోరలేదని, ఫైలిన్ తుఫాను తీవ్ర ప్రభావమేదీ చూపలేదని పంట దిగుబడుల గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయని రఘురామ్ రాజన్ అన్నారు.
అసలు రుణమాఫీ హామీ ఎందుకు, అంత కష్టం ఏమొచ్చిందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. నిరుడు సంభవించిన తుఫాన్లలో ఆంధ్రప్రదేశ్లోకానీ, తెలంగాణలోకానీ భారీగా పంటనష్టమేమీ జరగలేదని అన్నారు. రుణమాఫీ వంటి హామీలతో పార్టీలు ఎన్నికల ముందు ఎనలేని ఉదారత ప్రదర్శించాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటివి అమలు చేయడానికి ఒక పద్ధతి ఉంటుందని చెప్పారు. ఆ పద్ధతేమిటో కూడా వివరించారు.
ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు నష్టపోతే ఆ విషయాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించాలని ఆ తర్వాత బ్యాంకు రుణాల విషయంలో రైతుకు దానంతటదే మేలు జరుగుతుందని, అటువంటి ప్రాంతాల్లో వసూలుకాని బాకీలను బ్యాడ్లోన్స్గా పరిగణించబోమని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగింది వేరని అన్నారు.
రుణమాఫీ వంటి హామీలు అనేక విపరిమాణాలకు దారితీస్తాయని, నైతికపరమైన ఇబ్బందులూ తలెత్తుతాయని తాము మొదటి నుంచీ చెబుతున్నామనారు. ఒకసారి రుణమాఫీ చేస్తే మళ్లీమళ్లీ మాఫీ కోసం ఎదురు చూస్తారని ఆయన అన్నారు. లబ్ధిదారులతోపాటు, లబ్ధిపొందని వారూ మాఫీ గురించి ఆలోచిస్తూ అప్పులు తీర్చరని, ఇప్పుడు బాకీ కట్టేస్తే భవిష్యత్తులో తమకు అందే ప్రయోజనం రాకుండా పోతుందని భయపడతారని రాజన్ అన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇదే పరిస్థితి ఉందని రఘురామ్ రాజన్ అన్నారు. ఒకవేళ ఏదైనా ప్యాకేజీ ప్రకటించినా బకాయిదారులకు మాత్రం ఆ లబ్ధి చేకూర్చబోమని స్పష్టం చేశారు. ఏయే జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి, నిర్దిష్టంగా ఎక్కడ కష్టం వచ్చిందనే అంశాలపై రెండు ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని రఘురాం రాజన్ చెప్పారు.