గందరగోళం: 'పోటీ'గా కృష్ణంరాజు, బాబుపై బిజెపి గుర్రు
హైదరాబాద్/గుంటూరు: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య సీమాంధ్రలో పొత్తు రగడ కొనసాగుతోంది. సీట్ల విషయంలో ఓ వైపు చర్చలు కొనసాగుతుండగానే పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. నర్సాపురం, రాజంపేట లోకసభ తదితర అభ్యర్థుల విషయంలో టిడిపితో బిజెపికి పేచీ వచ్చింది. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో అంతా గందరగోళంగా మారిపోయింది.
బిజెపి నర్సాపురం లోకసభ టిక్కెట్ గోకరాజు రంగరాజుకు ఇచ్చింది. మొదటి నుండి బిజెపి తరఫున రఘురామ కృష్ణం రాజు ఆ టిక్కెట్ ఆశించారు. చివరి నిమిషంలో గోకరాజుకు వచ్చింది. దీనిపై రఘురామ అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా... గోకరాజు రంగరాజు నర్సాపురం లోకసభకు బిజెపి తరఫున నామినేషన్ దాఖలు చేశారు.
అదే సమయంలో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. నర్సాపురం టిక్కెట్ను రఘురామకు ఇవ్వాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు. మరోవైపు మదనపల్లి స్థానాన్ని టిడిపి బిజెపికి కేటాయించింది. ఇక్కడ టిడిపి నేత బోడపాటి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
చంద్రబాబుపై బిజెపి ఆగ్రహం
తమ సీట్ల పైన చంద్రబాబు నిర్ణయాలు ఏమిటని బిజెపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరి నిమిషంలో.. అదీ తమ పార్టీ అభ్యర్థుల పట్ల టిడిపి పట్టుబట్టడమేమిటని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. పొత్తులో భాగంగా తమకు వచ్చిన స్థానాల్లో తమ అభ్యర్థులను ఎవరిని పెట్టుకోవాలో తమకు తెలుసునని, చివరి నిమిషంలో చంద్రబాబు నిర్ణయాలపై బిజెపి ఆగ్రహంగా ఉంది.
కాగా, అభ్యర్థులపై గందరగోళం నేపథ్యంలో బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. తమకు కొందరు అభ్యర్థులపై అభ్యంతరాలు ఉన్నాయని టిడిపి చెబుతూ... అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతుండగా.. చర్చించుకుందామని బిజెపి చెబుతోంది. మరో విషయమేమంటే ఇంత గందరగోళం కనిపిస్తున్నా పొత్తు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఇరు పార్టీలు చెబుతున్నాయి.