తొలి దశలోనే వారికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వండి: ప్రధాని మోడీకి రఘురామ కృష్ణరాజు లేఖ
హైదరాబాద్/అమరావతి: దేశ వ్యాప్త కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే.
తొలి దశలోనే వారికీ వ్యాక్సిన్ వేయండి..
తొలి దశలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫ్రంట్లైన్ వారియర్స్ తోపాటు తొలి దశలోనే వ్యాక్సిన్ ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత, వ్యాక్సిన్ సన్నద్ధతలపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉన్నతస్థాయి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. కొద్ది రోజుల్లో రానున్న పండగల దృష్ట్యా వచ్చే శనివారం నుంచే వ్యాక్సిన్ వేయడం ప్రారంభించాలని నిర్ణయించారు.
తొలి దశలో వారికే ప్రాధాన్యత
తొలుత వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సఫాయి కర్మచారీలు సహ పలు వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. కరోనాపై పోరులో ముందున్న దాదాపు 3 కోట్ల మందికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడినవారికి, 50 ఏళ్లలోపు వయస్సున్నా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారికి టీకా ఇవ్వనున్ానరు. ఇక వీరంతా కలిపి దాదాపు 27 కోట్ల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వయసు తెలుసుకోవడానికి తాజా ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోనున్నారు.
30కోట్ల మందికి వ్యాక్సిన్.. ఆ రెండు వ్యాక్సిన్లే
తొలి ప్రాధాన్యత మొత్తంగా 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరితోపాటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరుతున్నారు. కాగా, హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లను జనవరి 16 నుంచి ప్రాధాన్యత క్రమంలో ఇవ్వనున్నారు.