ఆకు రౌడీలకు భయపడను..10వేల మందితో పులివెందులలో సభ పెడతా :ఎంపీ రఘురామ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తోలు తీస్తామంటూ తనపై వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తానెవరికీ భయపడే స్థాయిలో లేనని పేర్కొన్న ఆయన , తనను అనర్హుడిగా ప్రకటించడం లక్ష్యంగా వైసిపి నేతలు పని చేస్తున్నారని ఆరోపించారు. తనపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్న వారంతా బహు భాషా కోవిదులు అంటూ రఘురామకృష్ణంరాజు వ్యంగ్యంగా మాట్లాడారు.
తన ఒంటిపై చెయ్యి పడితే జరిగేది ఇదే ..
ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేనని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు తన ఒంటిపై చెయ్యి పడితే కాపాడేందుకు హేమాహేమీలు ఉన్నారని, వారు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే 10 వేల మందితో పులివెందులలో సభ పెట్టగలను. ప్రస్తుతం కరోనా కారణంగా ఆగుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసిన వైసిపి ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన రఘురామకృష్ణంరాజు న్యాయ వ్యవస్థ పై జరుగుతున్న దాడిని ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
తనను బహిష్కరించే దమ్ము లేదన్న రఘురామ
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు తప్పు పడుతున్నాయని తమ పార్టీ ఎంపీలు అంటున్నారని, ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా లేకపోవడం వల్లే కోర్టులో ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని రఘురామ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు . తనను అనర్హుడిగా ప్రకటించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ నేతలు చాలా ప్రయత్నం చేస్తున్నారని, అయినప్పటికీ తనను బహిష్కరించే దమ్ము లేదని రఘురామ వ్యాఖ్యానించారు.
ప్రజలు ఉమ్మేసేలా మాట్లాడటం తనకు చేతకాదంటూ..
తోలు తీస్తా మంటూ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు, ప్రజలు అసహ్యించుకునేలా, ఉమ్మేసేలా మాట్లాడటం తనకు చేతకాదని పేర్కొన్నారు.తోలు తీసే చేష్టలకు సమాధానం చెప్పే స్నేహితులు తనకు ఉన్నారంటూ రఘురామ వ్యాఖ్యానించారు. తన వృత్తి తోలు తీయడం కాదంటూ, అలా మాట్లాడిన వాళ్ళు బహుభాషా కోవిదులు , వారంతా సంస్కారవంతులు, విజ్ఞులు అని పేర్కొన్న రఘురామ తనని కంటికి రెప్పలా కాపాడుకునే స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చారు.
తనను కాపాడే వాళ్ళు పులివెందులతో సహా అన్ని ప్రాంతాల్లో ఉన్నారు
ఎంపీ రాజా భయ్యా తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. తనను రక్షించే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారని, రాయలసీమ, పులివెందులలో కూడా తనకు మిత్రులు ఉన్నారని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అవసరం అయితే పులివెందులలో పదివేల మందితో సభ పెడతానన్నారు .న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు రఘురామ. 151 సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చలేరని ,న్యాయవ్యవస్థపై ఈ తరహా దాడిని గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అంశం తమ పార్టీ ప్రాధాన్య అంశంగా చూడడం లేదని ఆయన వైసీపీ ఎంపీల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.