మైండ్ గేమ్ వద్దు: జగన్పై నిప్పులు చెరిగిన కృష్ణంరాజు
ఓ ఛానల్తో మాట్లాడుతూ ఆయన జగన్ పైన నిప్పులు చెరిగారు. తనతో మైండ్ గేమ్ ఆడవద్దని హెచ్చరించారు. తాను నోరు విప్పితే వారి జాతకాలు మొత్తం బయటపెడతానన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విభజన కోరుకుంటోంది కాబట్టే తాను పార్టీ నుండి బయటకు వచ్చానని చెప్పారు. జగన్ సమైక్య ముసుగు వేసుకున్న విభజనవాది అని దుయ్యబట్టారు.
రాష్ట్రం ఎప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే తప్ప తాను ముఖ్యమంత్రిని కాలేనని జగన్ విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి అనుమానాస్పదంగా ఉందని విమర్శలు గుప్పించారు.
స్వార్థపూరిత రాజకీయాలను ప్రజలు ఏమాత్రం క్షమించరన్నారు. పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి తాను భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. విభజన అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తానంటే జగన్ అడుగడుగునా అడ్డుకున్నారన్నారు.
జగన్ వ్యవహారశైలి పైన తాను కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. ఆయన ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారని, తాను మాత్రం ఆలస్యంగా మేల్కొన్నానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందన్నారు. జగన్ ఏం చెబితే అది నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. జగన్కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు.
ఎన్నికల కోడ్ వచ్చే సరికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సగం ఖాళీ అవుతుందని చెప్పారు. జగన్కు సంస్కారం లేదని, ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల వల్లనే బిల్లు వెనక్కి పోయిందన్నారు. షర్మిల, వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏమిటో అన్నారు.
అదే దారిలో జయప్రకాశ్
మరోవైపు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.