జగన్ను వెనకేసుకొస్తూనే అసాంఘిక శక్తులంటూ రఘురామ కృష్ణరాజు ఫైర్, ఆ ఎంపీనే టార్గెట్
అమరావతి: సొంత పార్టీ, ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. అమరావతి రైతులకు సుప్రీంకోర్టు శుభవార్త అందించిందని అన్నారు.
Recommended Video
ప్రజాధనం వృథా.. సుప్రీంతీర్పుతోనే న్యాయం..
అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్5 విషయంలో హైకోర్టు ఉత్తర్వులున సుప్రీంకోర్టు సమర్థించడం స్వాగతించదగిన విషయమని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. చీటికీమాటికీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడం ద్వారా ప్రయోజనం ఉండదని పరోక్షంగా వైసీపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాక, పెద్ద పెద్ద లాయర్లకు రూ. కోట్లు చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం మార్పు అంశంపై బుధవారం జరిగే విచారణలో కూడా రైతులకు న్యాయం జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీకి చెడ్డపేరు రావొద్దనే..
పార్టీకి చెడ్డ పేరు రావొద్దని తాను ఇచ్చే సలహాలు నచ్చని వారు ఇప్పటికీ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తాను ఫిర్యాదు చేసినప్పటికీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై సీఎం జగన్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. దేవేందర్ ఇంకా తనను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తూనే ఉన్నాడని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్.. విజయసాయి రెడ్డి ట్వీటే నిదర్శనం..
న్యాయ మూర్తులు ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురవుతున్నాయని, న్యాయ వ్యవస్థపై నిఘా అన్న పేరుతో పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు రఘురామ కృష్ణంరాజు. సీఎం చుట్టూ ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పార్క్ హయత్లో ఏదో జరిగిందంటూ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు నిదర్శనమన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఫేస్ టైంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డికి ఎలా తెలుస్తుందని రఘురామ ప్రశ్నించారు.
సీఎం జగన్ చుట్టూ అసాంఘిక శక్తులు..
సీఎం జగన్ తన చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనేది పసిగట్టాలని రఘురామ సూచించారు. న్యాయవ్యవస్తని, రాజ్యాంగ వ్యవస్తలను కూలదోస్తున్నారన్న అప్రతిష్ట తెచ్చుకోకండి అని హితవు పలికారు. అంతేగాక, పార్టీ దురభిమానుల ద్వారా ఫోన్ చేయించి వేధించవద్దని వేధించవద్దని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఈ అంశంపై తాను పార్లమెంటులో లేవనెత్తుతానని రఘురామ తేల్చి చెప్పారు.
జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలి..
ఇళ్ల సలాల పంపిణీ పేరుతో రాజమహేంద్రవరం పరిసరాల్లో 600 ఎకరాల భూములు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు. అప్పుడు కొందరు ఆ భూములు కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారని, అవి ఆవ భూములు కావని అన్నారని తెలిపారు. ఇప్పుడు వస్తున్న గోదావరి వరదల్లో ఆ ప్రాంతమంతా మునిగిపోవడం ద్వారా అవి ఆవ భూములే అని నిర్ధారణ అయ్యిందన్నారు. ఎకరం రూ. 40 లక్షలకు కొన్న ఆవ భూములు ముంపునకు గురికావడం ద్వారా రూ. వందల కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని ఆరోపించారు. అవకతవకలు జరిగినట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని.. ఈ వ్యవహారంలో వెంటనే విచారణ జరిపించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు రఘురామ వ్యాఖ్యానించారు.