సీఎం జగన్ కు రఘురామ మరో లేఖ.. రాజీనామా చేసి వెళ్లిపోవచ్చన్న స్పీకర్..
సొంత పార్టీపై పోరాటంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పంథా మార్చారు. ఇప్పటిదాకా ఎంపీ విజయసాయిరెడ్డిపైనో, మరో నేతపైనో విమర్శలకు దిగిన ఆయన.. రెండ్రోజులుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు. వివిధ అంశాలపై వరుసబెట్టి లేఖలు రాస్తోన్న ఆయన.. తాజాగా వృద్దాప్య పెన్షన్ల అంశంపై సీఎంకు లేఖ రాశారు. అంతకు ముందు, పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని, పార్లమెంట్ ఆవరణలో మన్యం వీరుడి విగ్రహం ఏర్పాటు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మరో లేఖ రాశారు.
పెన్షనర్లకు భారీ నష్టం..
వృద్ధాప్య పెన్షనర్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తూ ఏపీ సర్కారు జీవో ఇచ్చిందని, అయితే 2019 జూలై నుంచే అమల్లోకి తెస్తామన్న పథకం కాస్తా.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచిగానీ మొదలుకాలేదని, తద్వారా అర్హులైన వృద్ధులు ఒక్కొక్కరూ 7 నెలల కాలానికి గాను మొత్తం రూ.15,750 నష్టపోయారని, ఈ నష్టాన్ని వెంటనే పూడ్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని రఘురామ లేఖలో తెలిపారు. అలాగే, ప్రతి ఏడాది పెంచుతామని చెప్పిన రూ.250 పెన్షన్ కానుకను వైఎస్సార్ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని సూచన చేశారు. ఇదిలా ఉంటే,
వేటుపై ఇంకా లేటు..
రెబల్ ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయగా, పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తెలిపారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లిన శుక్రవారం నాడే.. తనపై అనర్హత వేటు వేయకుండా పార్టీని నిలువరించాలని కోరుతూ రఘురామ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్ నోటీసుల చట్టబద్ధత అంశం ఈసీ, లోక్ సభ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉందని, దానిపై క్లారిటీ వచ్చేదాకా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండేలా ఆదేశాలు జారీచేయాలని కోర్టును రఘురామ కోరారు. రెబల్ ఎంపీ పిటిషన్ పై ఈ వారం విచారణ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తంగా వైసీపీ అనుకున్నంత వేగంగా కాకుండా రఘురామపై వేటు ఇంకాస్త లేటయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు..
Recommended Video
రాజీనామాకు స్పీకర్ డిమాండ్..
రఘురామపై అనర్హత వేటు వ్యవహారం లోక్ సభ స్పీకర్ పరిధిలో పెండింగ్ లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రెబల్ ఎంపీ వ్యవహారంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేస్తున్నాడని, పార్టీలోనే కొనసాగుతానని చెబుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, పార్టీ నచ్చకపోతే వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని సీతారాం సూచించారు.