అదే తప్పు చేస్తారా?: టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అధికార వైసీపీ ఎంపీ
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తులు వేలం వేయాలన్న నిర్ణయాన్ని అధికార పార్టీ ఎంపీనే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు.
'తండ్రి శవాన్నే తాకట్టు పెట్టిన వ్యక్తి.. దేవుడి మాన్యాలను వదిలిపెడతాడా?’
ఆస్తుల విక్రయం అనేది ముమ్మాటికీ భూముల విరాళం ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని టీటీడీ భావించడం సరికాదన్నారు.
ఆస్తుల అమ్మకం భగవంతుడికి టీటీడీ చేస్తున్న ద్రోహం అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. టీటీడీ భూములపై పాలకమండలి నిర్ణయం ఏమాత్రం సరికాదన్నారు. భక్తితో ఇచ్చిన భూములు విక్రయించే నిర్ణయం ఆమోదయోగ్యం కాదన్నారు.
దాతలు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు పాలక మండలి పనిచేయాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయం విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అంతేగాక, ఈ నిర్ణయాన్ని త్వరలోనే టీటీడీ వెనక్కి తీసుకుంటుందని ఆకాంక్షించారు.
కాగా, నలువైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. టీటీడీ భూముల విక్రయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. వేలానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలూ రూపొందించలేదని తెలిపారు. ఆస్తుల విక్రయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. తదుపరి బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.