సీఎం జగన్ కు ఎంపీ రఘురామ మరో లేఖ.. రూ.1000కోట్లు ఏమయ్యాయంటూ ఆరా..
అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు ఉపక్రమించారు. జగన్ పార్టీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, మీరే కాపాడాలంటూ మోదీ సర్కారును అభ్యర్థించిన ఆయన.. 24 గంటలైనా తిరక్కముందే ముఖ్యమంత్రిపై మరో లేఖాస్త్రాన్ని విసిరారు. పేరుకు వివిధ సమస్యల్ని ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రతిసారి ఆయన లేవనెత్తుతోన్న అంశాలన్నీ వైసీపీని ఇరుకున పెట్టేలా ఉంటుండటంతో రఘురామ లేఖలకు ప్రాధాన్యం ఏర్పడింది.
విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్
వాళ్లు చెబితేనే రాస్తున్నా..
కోరనా లాక్ డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్లను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ సర్కారు కూడా ప్రయత్నిస్తున్నదని, అయితే రాష్ట్రం ఇంకా చేయాల్సింది చాలా ఉందని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఎంపీ రఘురామ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు కార్మికులు, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రతినిధులు తనను కలిసి, సమస్యలను మొరపెట్టుకున్నారని, అందుకే వాటి పరిష్కారాల కోసం లేఖ రాస్తున్నానని ఎంపీ తెలిపారు.
రూ. 1000 కోట్ల ప్రస్తావన..
లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న ఉచిత రేషన్, నగదు సాయం సరిపోవడంలేదన్న రఘురామ.. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల ఆధార్ కార్డు లింకేజీ, బిల్డర్ల నుంచి సెస్ వసూలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఏపీలో 20,64,379 మంది కార్మికుల పేర్లను ఆధార్ తో లింకు చేయాలని ప్రభుత్వం సంకత్పించినా, ఇప్పటివరకు 10,66,265 మంది పేర్లు మాత్రమే రిజిస్టర అయ్యాయని, ఈ ప్రక్రియ వేగవంతమయ్యేలా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా కార్మికుల పేర్లను నమోదు చేయించాలని ఎంపీ కోరారు. అదే సమయంలో రూ.1000 కోట్ల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
బిల్డర్ల నుంచి వసూళ్లు..
ఏపీలో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ కోసం ప్రభుత్వమే బిల్డర్ల నుంచి సెస్ రూపంలో డబ్బు వసూళ్లు చేయడాన్ని గుర్తు చేస్తూ, దానికి సంబంధించిన రూ.1000 కోట్ల వ్యవహారంపై రఘురామ ఆరా తీశారు. ‘‘2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్ల నుంచి లేబర్ వెల్ఫేర్ ఫండ్ రూపంలో రూ.1364 కోట్లు వసూలు చేశారు. దాంట్లో నుంచి ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ.330 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.1000 కోట్ల నిధిని కార్మికులకు పంంచండి. ఒక్కో కార్మికుడికి తక్షణ సాయంగా రూ.5వేలు ఇవ్వండి''అని ఎంపీ కోరారు.
ప్రాణాలకు ముప్పు.. భద్రత ఏది?
పార్టీ లైన్ ధిక్కరించిన కారణంగా ఎంపీ రఘురామపై అనర్హత వేటేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ అభ్యర్థించింది. మరోవైపు రెబల్ ఎంపీపై వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద ఎత్తున పోలీసు కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో తన భద్రతపై ఎంపీ రఘురామ సోమవారం మరోసారి కేంద్ర హోంశాఖ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిశారు. ఏపీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని, కేంద్రం భద్రత కల్పించాలని మరోసారి అడగ్గా, ఆ ప్రక్రియ పూర్తికావడానికి కొంత సమయం పడుతుందని హోం శాఖ బదులిచ్చినట్లు సమాచారం.
ముఖం నచ్చకుంటే వేటేస్తారా?
కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ తర్వాత వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మరోసారి అనూహ్య కామెంట్లు చేశారు. లోక్ సభ స్పీకర్ కు వైసీపీ చేసిన ఫిర్యాదుతో ఏమీ జరగదని, తనపై అనర్హత పిటిషన్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ‘‘నా ఎత్తు, నా ముఖం నచ్చకపోయినంత మాత్రాన అనర్హత వేటు వేస్తామంటే కుదురుతుందా?'' అని ఎదురుప్రశ్నించారు. అనర్హత ఫిర్యాదుపై ఏదోఒకటి తేలేదాకా వైసీపీ దాఖలు చేసిన కేసుల్లో అరెస్టుల నుంచి కాపాడాలంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.