రఘురామ ట్రంప్ కార్డు.. రాష్ట్రపతి వద్దకు పంచాయితీ.. ఒకనాటి జగన్ పరిస్థితేనన్న రెబల్.. కోర్టు విచారణ
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి పంటికింద రాయిలా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్రంప్ కార్డు(తురుపుముక్క)ను ప్రయోగించారు. తనపై అనర్హత వేటుకు సొంత పార్టీనే ప్రయత్నిస్తుండటం, కేంద్రం నుంచి భద్రత కల్పన అంశాల్లో ఏకంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి ఫిర్యాదు చేయబోతుననారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని నిర్ధారించారు. మరోవైపు, తనకు కేంద్రం నుంచి భద్రత కల్పించాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారించింది.
Recommended Video
జగన్ తో కేసీఆర్ సర్కారును పోల్చుతూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ప్రజలను గాలికొదిలేశారు..
రాష్ట్రపతి అపాయింట్మెంట్..
వైసీపీ ప్రభుత్వంలో తనకు రక్షణ లేదని, దురదృష్టకరమే అయినా కేంద్రాన్ని భద్రత కోరక తప్పలేదని రెబల్ ఎంపీ రఘురామ అన్నారు. ఈ విషయాలన్నీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు నివేదిస్తానని, మంగళవారం ఉదయం 11 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారైనట్లు రాష్ట్రపతి భవన్ నుంచి కబురొచ్చిందని తెలిపారు. తన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో సాగిన విచారణ వివరాలను కూడా ఆయన వెల్లడించారు.
కేంద్రం అండతో ఆ ధైర్యమే వేరు..
ఏపీ ప్రభుత్వం నుంచి రక్షణ తీసుకోకపోవడానికి బలమైన కారణం ఉందని, ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోక పోయేవాడినని, కానీ సాక్ష్యాత్తూ కేబినెట్ మంత్రే కేసు పెట్టడాన్ని బట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమైందని రఘురామ అన్నారు. ఇప్పటికీ తాను ఏపీ ప్రభుత్వాన్ని నమ్మితే గొర్రెలా ఉంటుందని, ఏదేమైనా కేంద్ర బలగాల భద్రత ఉంటే ఆ ధైర్యమే వేరని వ్యాఖ్యానించారు.
జగన్పై కక్ష..చంద్రబాబుతో సాయిరెడ్డి స్కెచ్ - కన్నా కోవర్టు ముసుగు - ఎవరికెవరు ఫిట్టింగ్?
అప్పటి జగన్ పరిస్థితే..
‘‘ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోలీసుల వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వివిధ సందర్భాల్లో చెప్పారు. అప్పట్లో ఆయనకు ఎదురైన పరిస్థితుల్నే ప్రస్తుతం నేనూ అనుభవిస్తున్నాను. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ నేను దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నివేదికలు వచ్చిన వెంటనే తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పగా, రెండు వారాల్లోగా ఐబీ నివేదికలన్నీ పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశించింది'' అని ఎంపీ రఘురామ వివరించారు.
బీజేపీ నేతల దన్ను..
సొంత పార్టీ వైసీపీపై, ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తోన్న ఎంపీ రఘురామ.. సీఎం జగన్ పై మాత్రం సానుకూలంగా మాట్లాడుతూ, తానింకా విధేయుడినే అని చెప్పుకోవడం తెలిసిందే. అనర్హత వేటు అంశం ఇంకా తేలాల్సి ఉన్నా.. బీజేపీతో రఘురామ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అదే పార్టీ నేతలు వివిధ సందర్భాల్లో రెబల్ ఎంపీకి దన్నుగా నిలుస్తుండటం, ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణపై సాయిరెడ్డి విమర్శలు చేసిన ప్రతిసారి బీజేపీ నేతలు కౌంటరిస్తూ రఘురామ అంశాన్ని ప్రస్తావిస్తుండటం గమనార్హం.