బెదిరిస్తే భయపడొద్దు .. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా ..రఘురామ సంచలనం
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వ వైఖరిపై , అలాగే వైసీపీ నేతల తీరుపై పలు అంశాలను ప్రస్తావించారు . బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, ఏపీ ప్రజలకు హితవు పలికారు. నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని అయినప్పటికీ ఎవరూ చలించవద్దు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎవర్ని ఎవరూ ఏమీ చేయలేరని, ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు .
ఇటీవల రాజీనామా చేసిన ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి పై కూడా రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా సలహాదారులు ఉన్నారని, సలహాదారులు విషయంలో ఇప్పటికైనా జగన్ నిర్ణయాన్ని మార్చుకుని ప్రభుత్వ సొమ్ము ఆదా చేసే పని చేయాలని సూచించారు. చేయడానికి పని లేదని రామచంద్రమూర్తి రాజీనామా చేసినట్లున్నారు అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
డాక్టర్ రమేష్ వ్యవహారంపై కూడా రఘురామ కృష్ణంరాజు స్పందించారు. డాక్టర్ రమేష్ ను అరెస్ట్ చేస్తామని వేధించి అవమానించడం, ఆయనకు జరిగిన అవమానం కాదని పవిత్రమైన వైద్య వృత్తికి జరిగిన అవమానం అని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఉన్న వారిపై కులం పేరుతో కక్ష కట్టడం దుర్మార్గమని రఘురామ మండిపడ్డారు. పిపిఈ కిట్లు లేవని ఎప్పుడో మాట్లాడితే డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యులు ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసు ఇవ్వటం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలకు వాక్ స్వాతంత్రం లేదా అని అడిగారు. వైయస్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా, మృదుభాషి గా డాక్టర్ గంగాధర్ కు పేరుందని పేర్కొన్న రఘురామ ఏపీలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.
శిరోముండనం కేసులో సీఎం సమీప బంధువు .. రాజధానిపై మింగ మెతుకు లేకున్నా... రఘురామ రచ్చ
ఒక దళిత యువకుడు మద్యం గురించి మాట్లాడితే, ఆ వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు చంపుతామని బెదిరించారని వార్తలు వచ్చాయని , ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలుస్తోందని పేర్కొన్నారు. ప్రాణాలు తీసుకోవడం బాధాకరమని మాట్లాడిన రఘురామకృష్ణంరాజు దయచేసి అందరూ ధైర్యంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు.
Recommended Video
తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ మూర్తి తనపైన రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఆడవాళ్లు మాట్లాడాల్సిన మాటలే కావని పేర్కొన్న రఘురామ ఎన్ని రకాలుగా ఏం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చిటికేసి మరీ చెప్పారు. ఎవరికీ భయపడేది లేదని రఘు రామ తేల్చిచెప్పారు.