పవన్ కళ్యాణ్పై రఘువీరా, జీతాలివ్వండి... 'ఏపీ' ఉద్యోగులపై కెసిఆర్కు హైకోర్టులో షాక్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి రఘవీరా రెడ్డి సోమవారం నాడు స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రయత్నిస్తోందని చెప్పారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని భగ్గుమన్నారు.
ఈ అంశం పైన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేడర్ కోటి సంతకాల సేకరణతో పాటు నిరసన తెలియజేస్తోందన్నారు. పవన్కు ఈ సమాచారం తెలియక పోవడం వల్లే కాంగ్రెస్ పోరాడాలని చెబుతోన్నారన్నారు.
టిడిపి ప్రభుత్వంపై బొత్స మండిపాటు
సహజవనరుల దోపిడీని అడ్డుకుంటున్న వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్రాసిటీ కేసులతో భయపెడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వేరుగా అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు తుని ఎమ్మెల్యే పైన దాడి కేసు పెట్టారన్నారు.
ఆయన పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం తహసీల్దారు వనజాక్షి వివాదాన్ని సెటిల్ చేసే సమయం ఉంది, కాని మున్సిపల్ కార్మికులతో చర్చించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వం చట్టాన్ని చేతులోకి తీసుకుంటోందన్నారు.
మాఫియా డాన్లా చంద్రబాబు: సీతారాం
చంద్రబాబు మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు చంద్రబాబు పాల్పడుతున్నారని వికీలీక్స్ పత్రిక వెల్లడించిందని, దీనిని ఆయన కాదనగలరా అని ప్రశ్నించారు.
రూ.7.5 కోట్లతో ట్యాపింగ్ పరికరాలు కొనుగోలుకు యత్నిస్తూనే మరోవైపు తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. గవర్నర్, శాసనసభ వ్యవస్థలను పాలకులు భ్రష్టు పట్టించారన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో షాక్ తగిలింది. గతంలో సీమాంధ్ర స్థానికత కలిగిన 1,200 మంది విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
తమను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే తొలగించాలంటూ ఉద్యోగులు దాఖలు చేసిన సర్వైవల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. రెండు రోజుల పాటు వాద, ప్రతివాదనలు జరిగాయి. స్పందించిన కోర్టు పై విధంగా ఆదేశాలిచ్చింది.